ఒక ఎన్నారైని పెళ్లి పేరు చెప్పి మాయమాటలతో యువతి నిలువునా ముంచేసింది. లక్ష కాదు... రెండు లక్షలు కాదు... ఏకంగా 13 లక్షల రూపాయలు అతని దగ్గర నుండి యువతి కాజేసింది. ఈ ఘటన ఛంఢీగడ్ లోని సుల్తాన్ పూర్ లోధిలో వెలుగు చూసింది. పూర్తి వివరాలలోకి వెళితే సుల్తాన్ పూర్ లోధికి చెందిన కుల్వీర్ సింగ్ అనే వ్యక్తి గడచిన కొన్ని సంవత్సరాలుగా ఫ్రాన్స్ లో నివాసం ఉంటున్నాడు. 
 
ఫ్రాన్స్ లో కుల్వీర్ సింగ్ కు తన స్వగ్రామానికి చెందిన అమన్ దీప్ కౌర్ అనే యువతితో మరియు అతని సోదరునితో పరిచయం ఏర్పడింది. తరచూ వీరు ముగ్గురు కలుసుకుని బయటకు వెళ్లేవారు. కుల్వీర్ సింగ్ అమన్ దీప్ కౌర్ ను ఇష్టపడగా కొన్ని రోజులకు ఆ ఇష్టం ప్రేమగా మారింది. అమన్ దీప్ కౌర్ కూడా కుల్వీర్ సింగ్ ను ఇష్టపడుతున్నట్టు చెప్పటంతో ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుందామని నిర్ణయం తీసుకున్నారు. 
 
ఆ తరువాత అమన్ ఇండియాకు వచ్చింది. ఆ తరువాత కుల్వీందర్ కు ఫోన్ చేసి ఫ్రాన్స్ కు రావడానికి తన దగ్గర డబ్బులు లేవని కొంత డబ్బు పంపించాలని కోరగా యువతిని నమ్మి కుల్వీందర్ డబ్బు పంపించాడు. ఆ తరువాత కూడా ఇదే విధంగా ఏదో ఒక కారణం చెబుతూ యువతి కుల్వీందర్ సింగ్ దగ్గర ఏకంగా 13 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఫ్రాన్స్ కు యువతి రాకపోవడంతో స్వగ్రామంలో ఉండే తన తండ్రికి కుల్వీర్ సింగ్ ఫోన్ చేసి యువతి గురించి వాకబు చేయాలని కోరాడు. 
 
కుల్వీర్ సింగ్ తండ్రి అజిత్ సింగ్ అమన్ గురించి వాకబు చేయగా అమన్ కు వివాహమైందని తెలిసింది. అజిత్ సింగ్ అమన్, ఆమె కుటుంబ సభ్యులను కలిసి 13 లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేయాలని కోరాడు. కానీ అమన్ మాత్రం డబ్బులు తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది. ఏం చేయాలో పాలుపోని అజిత్ సింగ్ చివరకు పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశాడు. పోలీసులు అమన్ పై, ఆమె తల్లిదండ్రులు, సోదరునిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: