కాషాయ పార్టీకి కొత్త దళపతి ఎంచుకున్నారు. ఇప్పటి వరకు అమిత్ షా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. కాగా, ఇప్పటి వరకు ముఖ్య కార్యదర్శిగా ఉన్న జేపీ నడ్డాను ఈరోజు అధ్యక్షుడిగా నియమించారు. పార్టీ బాధ్యతలను అమిత్ షా దగ్గరి నుంచి జేపీ నడ్డా పుచ్చుకున్నారు. గతంలోనే ఈయన అధ్యక్షుడు కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వలన అమిత్ షాను కొనసాగించారు. అయితే, షాకు ప్రభుత్వం మరికొన్ని బాధ్యతలు అప్పగించబోతుండటంతో...పార్టీ భారాన్ని జెపి నడ్డాకు అప్పగించారు. జేపీ ఆధ్వర్యంలో పార్టీ మరింత ముందుకు వెళ్తుందని అంటున్నారు.
వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అదే విధంగా వచ్చే ఏడాది వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అటు గుజరాత్ కు కూడా ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి. ఇలా వరసగా ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా పార్టీని గెలిపించే బాధ్యతను జేపీకి అప్పగించారు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన జేపీ నడ్డా అనేక మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
జేపీ సౌమ్యుడిగా పేరు ఉన్నది. అందరిని కలుపుకుని పోయే మనస్తత్వం కలిగిన వ్యక్తి. అమిత్ షా లాగ దూకుడు ప్రదర్శించేందుకు ఆసక్తి చూపించడు. అందుకే ఆయనకు పట్టం గట్టారు. హర్యానాలో తన చతురతతో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత జేపీకి ఉన్నది. అందుకే ఆయనకు అంతటి సపోర్ట్ దొరికింది. ఇదిలా ఉంటె, ఇప్పుడు జేపీ ముందు ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీని వీలైనంతగా గెలిపించే బాధ్యత ఆయనపై ఉన్నది.
పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత అయన మోడీని కలవబోతున్నారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను గురించి మోడీతో కలిసి నడ్డా చర్చించబోతున్నారు. అలానే కమలం తిరిగి దేశంలో అన్ని రాష్ట్రాల్లో వికసించేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో వాటి గురించి కూడా చర్చించబోతున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇలాంటి విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. ఢిల్లీ ఎన్నికలలో మంచి ఫలితాలు రాబట్టగలిగితే, బీజేపీ తిరిగి దేశంలో వికసిస్తుంది అనడంలో సందేహం ఉండదు.