ప్రస్తుతం దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నది. 2014 నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనేక విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తున్నది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కఠినంగా ఉన్నా వాటిని అమలు చేస్తూ పాటిస్తే కొత్త భారతావనిని చూడొచ్చు అన్నది అందరి ఉద్దేశ్యం. ప్రభుత్వం చట్టం చేస్తున్నప్పటికీ, దానిని కొంతమంది పాటించడం లేదు. సరే బయటి వ్యక్తులు పాటించడం లేదు అంటే సరిలే అనుకోవచ్చు. సొంత మనుషులే పాటించకపోతే ఎలా చెప్పండి.
బీజేపీ 2019 లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటగా ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ కు చట్టబద్దత లేకుండా చేసింది. ఇప్పటి వరకు తలాక్ తలాక్ తలాక్ అని మూడు మార్లు చెప్తే వారి పెళ్లి రద్దయినట్టే అవుతుంది. దీనివలన మగవాళ్లకు వచ్చిన నష్టం లేదు. కానీ, పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళూ మాత్రం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఒంటరిగా జీవిస్తున్నారు. చివరకు జీవనం సాగించేందుకు పడుపువృత్తిలోకి వెళ్లాల్సిన దుస్థితి వస్తున్నది.
దాని నుంచి బయటపడేందుకు కేంద్రం ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లుద్వారా మహిళలకు లాభం చేకూరుతుంది. ఒకవేళ భార్య నుంచి విడిపోవాలి అంటే తప్పకుండా కోర్టు ద్వారా మాత్రమే విడిపోవాలి. అలా కాకుంటే మాత్రం శిక్షపడుతుంది. ఈ బిల్లు తీసుకురావడంతో మగరాయుళ్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీకాదు. అయితే, చట్టం అమలులో ఉన్నప్పటికీ ఓ బీజేపీ నేత ట్రిపుల్ తలాక్ చెప్పి మహిళ నుంచి విడిపోయాడట.
ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్ లోని శివపురి పట్టణానికి చెందిన ఓ మాజీ కౌన్సిలర్ తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి వెళ్ళిపోయాడు. దీంతో షాకైన భార్య పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చిన తరువాత కూడా ఇలా విడిపోవడం భావ్యం కాదని, చట్టరీత్యా నేరం అవుతుందని పోలీసులు చెప్తున్నారు. తప్పకుండా న్యాయం చేస్తామని అభ్యం ఇస్తున్నారట.