ఎన్నో ఆశలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఊరించిన కేంద్ర బడ్జెట్ చివరకు ఊసురో అనిపించింది. బడ్జెట్లో కచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కీలకమైన ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో సాయం చేస్తుందని... రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన సామాన్య ప్రజలు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు. తీరా బట్జెట్ చూస్తే అదిరిపోయే షాక్ తగిలింది.
కనీసం కీలక ప్రాజెక్టుల విషయంలోనూ నిధులు వస్తాయనుకుంటే వాటి విషయంలోనూ కేంద్రం ఎంత మాత్రం పట్టించుకోలేదు. తెలంగాణలో కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ, ఇటు మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని ఎంత వేడుకున్నా కేంద్రం పట్టించుకోలేదు. చివరకు ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో ఇంత తీవ్ర అన్యాయం జరిగితే కనీసం పార్లమెంటులోనూ, బయట వచ్చి గళమెత్తిన నాథుడే లేకుండా పోయాడు.
వైసీపీ నుంచి ముందుగా ఆ పార్టీ రాజ్యసభ పక్ష నేత విజయసాయి రెడ్డి మాత్రమే స్పందించారు. ఆయన మాత్రం ఏపీకి చాలా అన్యాయం జరిగిందని.. ప్రత్యేకమైన నిధులు కేటాయించలేదని వాపోయారు. ఇక బయట మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ లోకసభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కేంద్ర బడ్జెట్పై ధ్వజమెత్తారు. అసలు తమ పార్టీ ఎంపీలకు కేంద్రంతో ఎలా ఫైట్ చేయాలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సరైన గైడెన్స్ ఇచ్చారా ? లేదా ? కేంద్రంతో ఫైట్ చేసి తమకు రావాల్సిన నిధులు రాబట్టు కోవడంలో వీరు ఎందుకు ఇంత అలసత్వంతో వ్యవహరిస్తున్నారన్నది మాత్రం అంతు పట్టని పరిస్థితి.
ఈ విషయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి తర్వాత ఎవరైనా అన్నది మరోసారి ఫ్రూవ్ అయ్యింది. వైఎస్ నాడు తాను కేంద్రంపై పోరాటం చేయడంలో కాని.. నాటి ఉమ్మడి రాష్ట్ర ఎంపీల ద్వారా కేంద్రంతో ఫైట్ చేయించి నిధులు రాబట్టుకోవడంలో కాని ఆయనకు ఆయనే సాటి అన్నట్టుగా ఉండేవారు. కానీ నేటి సీఎంలు మాత్రం ఆ విషయంలో చేతులు ఎత్తేస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది.