వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ ఎంపీ నందిగం సురేష్ పై దాడి చేయించటం చంద్రబాబు నాయుడు ఆకృత్యాలకు పరాకాష్ట అని అన్నారు. నందిగం సురేష్ గారు ఆరోగ్యం బాగోక ఆస్పత్రికి వెళ్లి వస్తూ ఉంటే పెయిడ్ వర్కర్స్ తో దాడి చేయించారని మేరుగ నాగార్జున అన్నారు. ఒక ఎంపీపై దాడి చేయించడం సాధారణమైన విషయం కాదని అన్నారు. ఈ దాడిని రాజధాని ఉత్సవం పేరుతో మొత్తంగా దళితులపై జరిగిన దాడి అని తాము భావిస్తున్నామని చెప్పారు. 
 
పార్లమెంట్ సభ్యుడిపైనే దాడి చేస్తే అమరావతి రాజధానిలో నోరు ఎత్తకూడదనే నెపం తెలుగుదేశం పార్టీది అని అన్నారు. ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు, లోకేష్ దాడి చేయించారని చెప్పారు. దళిత ఎంపీపై జరిగిన దాడి వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని అన్నారు. పేదవాళ్లు, దళితులు రాజధాని ప్రాంతంలో ఎక్కడికీ బయటకు వెళ్లకుండా వాళ్లలో భయం చేకూర్చాలనే దాడి చేయించారని అన్నారు. 
 
పోరాటం మాకు వెన్నతో పెట్టిన విద్య అని ఎప్పుడూ మీకు భయపడేది లేదని నాగార్జున అన్నారు. రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం ఒక్క ఆకృత్యం చేసిందా...? అనేక ఆకృత్యాలు చేసిందని నందిగం సురేష్ అన్నారు. మీ దాష్టీకాలకు దళితుల భూములు లాక్కున్నారు.. దళితుల భూములను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ మంత్రులు కొన్నారని ఆరోపణలు చేశారు. 
 
రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి రైతులకు ఒక ప్యాకేజీ, దళితులకు ఒక ప్యాకేజీని ఇచ్చారని అసృశ్యత, అంటరానితనానికి నిలువుటద్దం చంద్రబాబు అని మేరుగ నాగార్జున అన్నారు. దళితుల భూములు దళితులకు మాత్రమే చెందుతాయని చట్టం చెబుతోందని నాగార్జున అన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రి అయినా దళితులకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హక్కులు కూడా మీకు తెలియవా...? అని చంద్రబాబును ఎమ్మెల్యే ప్రశ్నించారు. 
 
దళితులకు చంద్రబాబు ద్రోహం చేశారని మేరుగ నాగార్జున అన్నారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ బేధాలు, తారతమ్యాలు ఉండరాదని ఆనాడు శ్రీబాగ్ ఒప్పందంలో వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకొని మూడు రాజధానులుగా ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచనతో ఉంటే చంద్రబాబు కౌన్సిల్ లో మోకాలడ్డేస్తారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు కళ్లు లేని కబోధులు కాదని నాగార్జున చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: