వైసీపీ నాయకులపై ఇటీవల తరచూ టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. అమరావతి ఉద్యమం పేరుతో వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. మొన్న ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్, నిన్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నేడు ఎంపీ నందిగం సురేష్..
ఇలా వైసీపీ ప్రజాప్రతినిధులపై దాడులు జరిగాయి. అయితే ఇక్కడో విషయం ఉంది. ఇలా దాడులకు గురైన వారంతా దళితులే కావడం కూడా ఓ కుట్ర ప్రకారమే జరుగుతోందంటున్నారు వైసీపీ నేతలు.
రాజధాని ఉద్యమం పేరుతో అధికార పక్ష దళిత ప్రజాప్రతినిధులపైనే చంద్రబాబు దాడులు చేయిస్తున్నాడని వైసీపీ దళిత నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా దళిత ఎంపీ నందిగం సురేష్పై దాడి చేయించడం చంద్రబాబు ఆకృత్యాలకు, లోకేష్ పిల్ల చేష్టలకు పరాకాష్ట అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. ఈ దాడి వెనక పెద్ద కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
మంగళగిరిలో ఓటమికి దళితులే కారణమనే నెపంతో లోకేష్ దాడులు చేయిస్తున్నాడన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు, ఆయన కోటరీ దళితుల అసైన్డ్ భూములను బెదిరించి లాక్కున్నారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నాడని, చట్టాలు కూడా తెలియని నీచమైన నాయకుడు చంద్రబాబు అని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున దుయ్యబట్టారు.
దళితులకు సంబంధించిన చట్టాలు అసెంబ్లీలో వస్తుంటే చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయాడని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ విభజనపై చర్చ జరుగుతుంటే సభ నుంచి పారిపోయాడన్నారు. అంటరానితనం చంద్రబాబు మదిలో, ఆలోచనలో ఉందని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున విమర్శించారు. కుట్ర ప్రకారమే చంద్రబాబు, ఆయన గ్యాంగ్ దళితులను టార్గెట్ చేశారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆరోపిస్తున్నారు. మరి ఈ మాటల్లో ఎంత వరకూ వాస్తవం ఉందో.. చంద్రబాబుకే తెలియాలి.