ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని నిలదీస్తామని చెబుతూ వస్తున్న సీఎం జగన్‌ మోహన్ రెడ్డి గారికి కేంద్రం మొండి చేయి చూపింది. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, ఇచ్చిన నిధులను సరిగా వినియోగించుకుంటే సరిపోతుందని, ఉచిత సలహా ఇచ్చినట్లు రాజకీయ వర్గాల తాజా సమాచారం. లోక్‌సభ వేదికగా మరోసారి కేంద్రం కుండబద్ధలు కొట్టింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేమని, దాన్ని బట్టి ఏపీకి కూడా హోదా కుదరదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. కాకపోతే, ఆ రాష్ట్ర అభివృద్ధికి మాత్రం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. 

 

ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనని... బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా, పార్లమెంటు సమావేశాలకు ముందు లైబ్రరీ భవనంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి హాజరై.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పించాలని చెబుతూనే.. ఏపీ అభివృద్ధికి సంబంధించి 9 అంశాలను లేవనెత్తారు. 

 

ఇక రెవెన్యూ లోటు బకాయిలు రూ.18,969 కోట్లు విడుదల చేయాలని, వెనుకబడిన జిల్లాలకు రూ.23వేల కోట్లు ఇవ్వాలని విన్నవించారు. పోలవరం ప్రాజెక్టుకు ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3,283 కోట్లను కేంద్ర రీయింబర్స్‌మెంట్ చేయాలని కోరారు. అలాగే.. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ గ్రాంట్‌గా రూ.47,424 కోట్లు ఇవ్వాలని రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్‌కు ఆర్థిక సాయం చేయాలని అడిగారు. 

 

ఏదిఏమైనా, చివరికి ప్రత్యేక హోదా కలగానే మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. లోక్‌సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. ప్రత్యేక హోదా ముగిసిన అంశం అని స్పష్టం చేశారు. 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా రద్దు చేశామన్నారు. అందుకే దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: