దొనకొండ.. ఒకప్పుడు ఈ పేరు మారుమోగిపోయింది. 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. ప్రకాశం జిల్లాలోని ఈ ప్రాంతానికే రాజధాని వస్తుందని అంతా అనుకున్నారు. ఈ దొనకొండ చుట్టుపక్కల వైసీపీ నేతలు చాలామంది భూమలు కొన్నారని టీడీపీ నేతలు ఆరోపణలు కూడా చేశారు. ఏదేమైనా మొత్తానికి దొనకొండ తలరాత మాత్రం గత ఐదేళ్లలోఏమీ మారలేదు.

 

కానీ ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక దొనకొండ తలరాత మారబోతోంది. అదెలా అంటారా..

దొనకొండ కేంద్రంగా డిఫెన్స్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తొంది. ఈ విషయాన్ని ఏపీ పరిశ్రమ మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు. మేకిన్‌ ఇండియా ప్రాజెక్టులో భాగంగా రక్షణ ఉత్పత్తుల పరిశ్రమకు దొనకొండ అనువైన ప్రాంతమని అన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ పరిశ్రమల శాఖ ప్రతిపాదనలు కేంద్రానికి పంపిందని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు.

 

డిఫెన్స్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు అవసరమైన భూమి దొనకొండలో అందుబాటులో ఉందని, ఏరోస్పేస్, రక్షణ, పరిశ్రమల స్థాపనకు దొనకొండ ప్రాంతం కీలకంగా మారనుందని ఆయన వివరించారు. దొనకొండకు దగ్గరలో ఉన్న కృష్ణపట్నం, చెన్నై పోర్టుల నుంచి ఎగుమతి, దిగుమతులను జరుపుకునే అవకాశముందని మంత్రి గౌతమ్‌ రెడ్డి తెలిపారు. అందుకే.. ఫ్రెంచ్‌ కంపెనీలతో కలిసి పనిచేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అన్నారు.

 

లక్నోలో జరుగుతున్న ఫ్రెంచ్‌ – ఇండో డిఫెన్స్‌ ఎక్స్‌పో – 2020 కార్యక్రమానికి మంత్రి గౌతమ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఫెన్స్ ఎక్స్‌పో కార్యక్రమానికి హాజరైన 35 దేశాల ప్రతినిధులతో మంత్రి గౌతమ్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమయంలోనే ఆయన దొనకొండ గురించి మాట్లాడారు. మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పిన ప్రణాళిక నిజమైతే దొనకొండ ప్రాంతం భవిష్యత్ మారిపోయే అవకాశం పుష్కలంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: