కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. చైనాలోని వూహాన్ లో అప్పుడే పుట్టిన పసికందుకి కరోనా వైరస్ సోకినట్టు వైద్య అధికారులు గుర్తించారు. ఆ బిడ్డకు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ వైరస్ సోకి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. ప్రసవం కావడానికి ముందు తల్లికి జరిపిన పరీక్షల్లో ఆమెకు కరోనా వైరస్ ఉన్నట్టు వైద్యులు తేల్చారు.
దీంతో బిడ్డకు గర్భంలోనే ఆ వైరస్ సోకి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి 490 మంది మరణించారని చైనా ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ఇంకా 24 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు. చైనాలో 31 ప్రావిన్షియల్ రీజియన్ లలో ఇది విశ్వరూపం చూపిస్తోంది.
చైనాలో వ్యాధిగ్రస్తుల సంఖ్య అంతకంతకీ పెరిగిపోతూ ఉండడంతో వూహాన్ లో ఉన్న జాతీయ స్టేడియం, జిమ్ లనే తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు చైనాలో కరోనా ధాటికి భయపడిపోయి హాంగ్ కాంగ్ వచ్చేవారి సంఖ్య పెరిగిపోతోంది. దీంతో చైనా నుంచి వచ్చిన వారిని తప్పనిసరిగా రెండు వారాల పాటు నిర్బంధంలో ఉంచుతామని హాంగ్ కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ ప్రకటించారు.
జనవరి 19న చైనా నుంచి వచ్చిన 41 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో అతనిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రికి తరలించారు. అయితే రక్త నమూనాలు ఇవ్వకుండా అతను పరారీ కావడం ఆందోళన రేపుతోంది. కాగా, కరోనా వైరస్ నిర్మూలనకు చైనాతో కలిసికట్టుగా పోరాటం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం గుజరాత్ లో వజ్రాల వ్యాపారాన్ని చావు దెబ్బ కొట్టనుంది. వచ్చే రెండు నెలల్లో 8 వేల కోట్ల రూపాయల నష్టం వస్తుందని మార్కెట్ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.