అభద్రతాభావానికి గురైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, తమ రాజకీయ-ఆర్ధిక ప్రయోజనాలు కాపాడుకునేందుకు మూకుమ్మడిగా బిజెపిలో చేరేలా చూడాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు విధిలేని పరిస్థితిలో తన పార్టీని బిజెపిలో విలీనం చేస్తారు. దానితో రాష్ట్రంలో ‘ఆపరేషన్ టిడిపి’ విజయవంతంగా పూర్తవుతుంది. అప్పటివరకూ, అంటే టిడిపి బలహీనపడే వరకూ జగన్కు తెరచాటు మద్దతు ఇస్తూనే ఉంటుంది. మొత్తానికి ఏపీలో టిడిపిని రాజకీయంగా నిర్వీర్యం చేసే మాస్టర్ప్లాన్ ప్రారంభమయిందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బిజెపి బలపడాలంటే, ముందు ప్రతిపక్షంగా ఉన్న టిడిపిని బలహీనం చేయాలి.
అది జరగాలంటే టిడిపిని ఆర్ధికంగా దెబ్బతీయాలి. అందులో భాగంగానే బీజేపీ పొలిటికల్ మాస్టర్ప్లాన్కు తెరలేపింది. ఈ ప్లాన్ ప్రకారం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని నిరీర్యం చేయడం ద్వారా, తొలి అడుగువేయాలన్న ఆపరేషన్ను చంద్రబాబు సన్నిహితులపై ఐటి దాడులతో మొదలుపెట్టింది. బాబు సన్నిహితులపై దాడులు చేసేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం విజయవాడ, హైదరాబాద్కు రావడం, అది కూడా సీఆర్పిఎఫ్ బలగాలతో దాడులు చేయడం బట్టి.. ఇవి రాజకీయ ప్రేరేపిత దాడులని సులభంగానే అర్ధమవుతోంది. బాబు మాజీ పిఎస్ సహా ఆయన సన్నిహితుల ఇళ్లపై దాడులు చేశారంటే.. ఇక బిజెపి చంద్రబాబును రాజకీయ పద్మవ్యూహంలో ఇరికించే ప్రణాళికకు తెరలేపినట్లే అర్ధం చేసుకుని తీరాలి.
ఎన్నికలైన 7 నెలల తర్వాత ఈ దాడులు జరగడం, అది కూడా దాడులకు గురైన వారంతా ఏదో ఒక రూపంలో బాబుకు అత్యంత నమ్మకస్తులే కావడం గమనార్హం. టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వద్ద సుదీర్ఘకాలం పిఎస్గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్, డిఎన్సి ఇన్ఫ్రా అధినేత నరేన్, కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఆర్విఆర్ ఇన్ఫ్రా (నవయుగ), మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్, లోకేష్ సన్నిహితుడు రాజేష్ నివాసాలపై ఢిల్లీ నుంచి వచ్చిన ఐటి బృందం ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్లో దాడులు జరపడం సంచలనం సృష్టించింది. మరో మూడురోజులపాటు ఈ దాడులు కొనసాగే అవకాశం. నిజానికి చాలాకాలం నుంచి రాజకీయవర్గాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేసేలా ఈ దాడులు జరగడం ఆసక్తి కలిగిస్తోంది.