ప్రస్తుత కాలంలో ఉన్న తల్లిదండ్రులు మరి దారుణంగా తయారవుతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులు వారికి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఇటీవల కాలంలో సొంత కుతురిపైనే హత్యాచారం చేసిన ఘటనలు ఎన్నో బయటపడ్డాయి. ఇప్పుడు  తాజాగా.. తండ్రి తన కన్న కూతురిని కాలువలోకి నెట్టేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. తన కూతురు అడిగితే డబ్బులు ఇవ్వలేదని తండ్రి ఇంత దారుణానికి ఒడిగట్టాడు.

 

 

వివరాల్లోకి వెళితే.. బళ్లారిలోని బండిహట్టి ప్రాంతానికి చెందిన సూరి అలియాస్‌ ఆటో సూరి కూతురు పల్లవి(22) రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు కార్యాలయంలో పనిచేస్తోంది. మద్యానికి బానిసైన సూరి తాగడానికి డబ్బులు ఇవ్వాలంటూ తరుచూ కూతురిని వేధించేవాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ కసాయి తండ్రి కన్నకూతురినే కాలువలోకి తోసేసి చంపేశాడు. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన తండ్రే ఇలా చేస్తే తమ బిడ్డలు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో...

 

 

ఆదివారం కూడా పల్లవిని డబ్బులు అడగ్గా ఆమె చిరాకుపడింది. సంపాదించిన సొమ్మంతా నీ తాగుడికే సరిపోతోంది. నీతో కలిసి ఉండటం కంటే చావడం మేలంటూ గొడవపడింది. సోమవారం ఉదయం కూడా సూరి ఇలాగే చేయడంతో పల్లవి హెచ్ఎల్‌సీ కాలువ వద్దకు చేరుకుని మరోసారి డబ్బులు అడిగితే అందులో దూకి చస్తానంటూ బెదిరించింది. దీంతో రెచ్చిపోయిన సూరి డబ్బులు ఇవ్వనప్పుడు నువ్వెందుకు అంటూ తానే పల్లవిని కాలువలోకి తోసేశాడు.

 

 

ఈ ఘటనను చూసిన ఓ యువకుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గజ ఈతగాళ్లతో పల్లవి కోసం గాలించినా ఫలితం లేకపోయింది. సూరి వేధింపులతో మూడేళ్ల క్రితం భార్య ఆత్మహత్య చేసుకుందని, ఇప్పుడు కూతురు కూడా ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండో కూతురిని అయినా అతడి బారి నుంచి కాపాడాలని పోలీసులను కోరుతున్నారు. పోలీసుల సూరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: