లక్ష్మి నరసింహ సినిమాలో బాలక్రిష్ణ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల దగ్గర ఎంత ఆదరణ పొందింది. ఆ డైలాగ్ లో చెప్పినట్టుగా నిత్య జీవితంలో కూడా ఒక్క కుటుంబంలో జరిగింది. తొమ్మిదేళ్లలో ఇలా పుట్టిన వారంతా ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ ఉన్నారు. ఆరో చిన్నారి కూడా పుట్టి చనిపోవడంతో... వారి తల్లిదండ్రులపై చుట్టుపక్కల వాళ్లకు అనుమానం కలిగింది. ఏంటి ఇలా వీళ్లకు పుట్టినవాళ్లంతా ఎందుకిలా చనిపోతున్నారంటూ అనుమానాలు రేకెత్తించారు. కొందరు ఈ విషయాన్నిపోలీసుల వరకు తీసుకెళ్లారు. 

 

ఈ ఘటన కేరళ రాష్ట్రం మల్లాపూర్‌లోని తిరూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా నివాసం ఉంటున్న దంపతులకు ఆరుగురు సంతానం కలిగారు. అందులో ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. అయితే వారంతా ఒకేసారి పుట్టలేదు. పుట్టినవాళ్లంతా తొమ్మిదేళ్ల కాలంలో ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ వస్తున్నారు. ఓ పాప మాత్రం నాలుగేళ్ల వరకు బతకగా.. మిగిలిన వారంతా నెలల వయస్సులోనే మరణించారు.

 

తాజాగా ఓ పాప పుట్టి చనిపోవడంతో దంపతులపై చుట్టుపక్కల వారికి అనుమానాలు వచ్చాయి. దీంతో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దంపతుల్ని విచారించారు. దీంతో తమకు పుట్టిన పిల్లలు చనిపోతున్నారన్న విషయం నిజమేనన్నారు. అయితే వారంతా జన్యపరమైన లోపాల వల్లే చనిపోయారంటూ తల్లిదండ్రులు తెలిపారు. దీంతో పోలీసులు చివరిగా చనిపోయిన చిన్నారికి పోస్టు మార్టం నిర్వహించారు. రిపోర్టులో చిన్నారిది సాధారణ మరణంనే తేలింది. 

 

చిన్నారి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తేల్చారు. డాక్టర్లు కూడా చిన్నారిది జన్యపరమైన లోపాలతో కలిగిన మరణమేనని తెలిపారు. దీంతో ఇప్పుడు పోలీసులు... అంతకుముందు చనిపోయిన చిన్నారుల మృతదేహాల్ని వెలికితీసి వాటికి పోస్టుమార్టం నిర్వహించే పనిలో పడ్డారు. ఆ రిపోర్టులు కూడా వచ్చాకే ఈ చిన్నారుల వరుస మరణాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: