అమరావతిలో గతకొద్దీ రోజులుగా రాజధాని విషయంపై నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం పేద వారికీ ఇళ్ల స్థలాలను కేటాయించాలని అనుకున్న విషయం అందరికి తెసిందే. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలను ఉగాది నాటి అందజేయాలన్నారు. ఆదేశం మేరకు భూముల సర్వే పనుల్లో అధికారులు బిజీగా మారిపోయారు. భూముల సర్వే విషయం పైనే రాజధాని ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  

 

గుంటూరు జిల్లా దుగ్గిరాల, పెదకాకాని మండలాల్లోని పేదలకు మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థల పరిశీలన కోసం తహసీల్దార్ మల్లీశ్వరి, ఇతర అధికారులు వచ్చారు. కృష్ణాయపాలెం శివారులో అధికారులు కారు దిగి మ్యాపులు పరిశీలిస్తున్నారు. ఆ విషయాన్ని గమనించిన కొందరు రైతులు వెంటనే కృష్ణాయపాలెంలో దీక్ష చేస్తున్న రైతులకు తెలిపారు.

 

వెంటనే అప్రమత్తమైన రైతులు పెద్ద సంఖ్యలో అధికారుల వద్దకు బయలుదేరారు. అది గమనించిన అధికారులు కార్లు ఎక్కి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే రైతులు,మహిళలు అక్కడికి చేరుకున్నారు. వారు తహసీల్దార్ కారుకు అడ్డంగా బైఠాయించారు. ఇక్కడికి ఎందుకు వచ్చారన్న ప్రశ్నకు మల్లీశ్వరి సరైన సమాధానం చెప్పకుండా కారులోనే కూర్చోవడంతో రైతులు కూడా అలాగే కూర్చున్నారు. విషయం తెలిసిన పరిసర గ్రామ రైతులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

రైతులు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తహసీల్దార్ కారును కదలకుండా అడ్డుకున్నారు. చివరికి స్పందించిన అధికారులు, పోలీసులు ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనన్నారు. ఇంకా ఖరారు కాలేదని చెప్పడంతో రైతులు శాంతించారు. సర్వేల పేరుతో తమ భూముల్లోకి మరోమారు వస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలకు తాము బాధ్యత వహించబోమని జేఏసీ నేతలు ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. మరోమారు వారి భూముల జోలికి వస్తే తీవ్ర పరిణామాలుంటాయని అధికారులకు హెచ్చరిక చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: