అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా టూర్ నేపథ్యంలో అసలు ఇప్పటి వరకూ ఎంత మంది అమెరికన్ ప్రెసిడెంట్స్ వచ్చారు.. వారు ఏం చేశారు.. ఓ సారి పరిశీలిద్దాం.. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకూ ఆరుగురు అమెరికా అధ్యక్షులు మన దేశంలో పర్యటించారు. నేడు వస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఏడో అధ్యక్షుడుగా చెప్పుకోవచ్చు.
భారత్లో పర్యటించిన తొలి అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్. 1959లో భారత్ పర్యటించిన ఐసెన్ హోవర్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీ , ఆగ్రా తదితర ప్రాంతాల్లో నాలుగు రోజులు పర్యటించారు. మనదేశంలో పర్యటించిన రెండో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ ఎం.నిక్సన్. 1969లో ఆయన ఒక్క రోజులోనే ఢిల్లీ టూర్ కంప్లీట్ చేశారు. అప్పట్లో ఇందిరా గాంధీతో ఉన్న విభేదాలను తగ్గించుకోవడానికే ఈ పర్యటన జరిపారని చెబుతుంటారు.
నిక్సన్ తర్వాత 1978లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మి కార్టర్ భారత్కు వచ్చారు. 3 రోజులు పర్యటించారు. బంగ్లాదేశ్ యుద్ధం, 1974లో భారత్ అణు పరీక్షల నేపథ్యంలో భారత్-అమెరికాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే ఉద్దేశంతోనే ఆయన పర్యటన జరిగింది. అయితే భారత్ అణు పరీక్షల నేపథ్యంలో ఉభయ దేశాల సంబంధాలు బెడిసి కొట్టాయి. అందుకే మళ్లీ 22 ఏళ్ల తర్వాత 2000 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్కు వచ్చారు.
బిల్ క్లింటన్ తన కుమార్తె చెల్సియాతో కలిసి 5 రోజులు భారత్లో ఉన్నారు. రెండు దేశాల సంబంధాలు మెరుగయ్యేందుకు క్లింటన్ కృషి చేశారు. ఆ తర్వాత 2006లో జార్జి డబ్ల్యూ బుష్ తన సతీమణి లారా బుష్తో కలిసి భారత్లో పర్యటించారు. ఆ తర్వాత బరాక్ ఒబామా భారత్లో రెండు సార్లు పర్యటించారు. రెండు దేశాల సంబంధాలు మరింత మెరుగు పడేందుకు బాటలు వేశారు.
మోడీ ప్రధాని అయ్యాక 2015లో మరోసారి ఒబామా తన సతీమణి మిషెల్తో కలిసి ఇండియా వచ్చారు. భారత గణతంత్ర వేడుకలకు హాజరైన తొలి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాయే. తర్వాత అమెరికా అధ్యక్షుడయ్యాక ట్రంప్ తొలిసారిగా ఈ నెల 24, 25 తేదీల్లో భారత్లో పర్యటిస్తున్నారు.