ఐరాసలో ఓ ఉద్యోగిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఇండియాలో టాప్ పొజిషన్ లో ఉన్నారు. అయన ఎవరో కాదు. ప్రశాంత్ కిషోర్. క్లుప్తంగా ఆయన్ను పీకే అని పిలుస్తుంటారు. 2014లో పీకే మొదట ప్రధాని మోడీతో కలిసి పనిచేశారు. మోడీ విజయానికి బాటలు వేసిన పీకే, దేశంలో మొదటిసారి వెలుగులోకి రావడంతో హావా మొదలైంది. అక్కడి నుంచి వరసగా అయన విజయాలు సాధిస్తూ వస్తున్నారు.
అయితే, యూపీలో మాత్రం అయన అంచనాలు తలక్రిందులయ్యాయి. యూపీలో కాంగ్రెస్ తరపున ఎన్నికల వ్యూహం రచించారు. అక్కడ ఫెయిల్ అయ్యారు. కానీ, బీహార్ లో సక్సెస్ కావడంతో మరోసారి అయన వెలుగులోకి రావడం జరిగింది. అక్కడి నుంచి అయన తిరిగి వెనక్కి చూసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లో వైకాపా తరపున పనిచేసిన పీకే సూపర్ మెజారిటీతో జగన్ గెలిచేలా చేయగలిగారు. ఆ తరువాత మహారాష్ట్రలో శివసేన తరువాత కొంత పనిచేశారు.
ఢిల్లీలో సామాన్యుడి పార్టీ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ హస్తం ఉన్నది. ఈ విజయం తరువాత పీకే అన్ని విషయాల్లో దూసుకుపోతున్నారు. ఒకవైపు పార్టీలతో కలిసి పనిచేస్తూనే, కొన్ని విషయాల్లో కేంద్రంతో విభేదిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా సిఏఏ విషయంలో ప్రశాంత్ కిషోర్ బహిరంగంగా కేంద్రాన్ని విమర్శించడంతో ఆయనపై బీహార్ ముఖ్యమంత్రి వేటు వేశారు. సరే ఇదంతా వేరే విషయం అనుకోండి.
ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల కోసం పనిచేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. పశ్చిమ బెంగాల్లో మమత కోసం, తమిళనాడులో డిఎంకె కోసం అయన పనిచేస్తున్నారు. అదే విధంగా 2023 లో కర్ణాటకక కోసం కూడా పనిచేయబోతున్నారు. కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ తరపున పీకే ప్రచారం చేయబోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ పీకే హస్తం ఉండేలా చూసుకుంటున్నారు.