తెలంగాణలో విద్యార్థులకు పరీక్షా కాలం మొదలైంది. గత ఏడాది ఇంటర్ బోర్డ్ నిర్వాకంతో ఎంత రచ్చ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్ బోర్డ్ చేసిన తప్పిదాలకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫస్ట్ క్లాస్ వస్తామని అనుకున్న విద్యార్ధులు ఫెయిల్ కావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. దాంతో ఇంటర్ బోర్డు వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున గొల చేస్తూ.. నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. ఇక ఈసారి ఇంటర్ బోర్డు చాలా సీరియస్ గా వ్యవహరించబోతున్నారట. ప్రతి విషయంలో జాగ్రత్తలు వహిస్తూ ఎలాంటి తప్పిదాలకు చోటు ఇవ్వకుండా చూస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి.
ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా హాల్లోకి అనుమతించమని ఇంటర్ బోర్డు అధికారులు చెప్పారు. విద్యార్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి చిత్రా రామచంద్రన్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. 'పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. ఇంటర్ విద్యార్థుల కోసం అదనపు బస్సు సర్వీస్లు నడుపుతున్నామని వివరించారు. విద్యార్ధులను నేలమీద కూర్చోబెడితే ఆ కళాశాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన విషయం లేదని.. ప్రశాంతంగా హాజరై పరీక్షలు రాయాలని వారు సూచించారు. ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ యాప్ ద్వారా పరీక్షా కేంద్రాన్ని గుర్తించొచ్చు' అని రామచంద్రన్ వివరించారు. ఇంటర్బోర్డు అధికారిక వెబ్సైట్ నుంచి విద్యార్థులు తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకొనే సదుపాయాన్ని బోర్డు అధికారులు కల్పించారు. గత ఏడాది జరిగిన విషయంపై తల్లిదండ్రులు ఇప్పటికీ టెన్షన్ పడుతూనే ఉన్నారు. పిల్లలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎగ్జామ్స్ రాస్తే.. రిజల్ట్ ఎలా వస్తాయో అని టెన్షన్ లో ఉన్నారు.