యావత్ భారత దేశం అంతటా పెను సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. తమకు న్యాయం చేయాలంటూ దిశ నిందితుల కుటుంబ సభ్యులు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం అందరికి విదితమే. దిశ నిందితులది అత్యంత దారుణమైన ఎన్‌కౌంటర్‌ అని.. అందులో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేసి, వారికి తగు శిక్షలు అమలు చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్‌ చేశాయి.

 

ఈ క్రమంలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జ్యూడిషియల్‌ కమిషన్‌ను కలిసేందుకు వారు హైకోర్టుకు చేరుకున్నారు. పరిహారంపై కమిషన్‌ ముందు ప్రస్తావించాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గురువారం కమిషన్‌ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జ్యూడిషియల్‌ కమిషన్‌కు నిందితుల కుటుంబ సభ్యులు అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు సమాచారం. 

 

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ సమీపంలో గత సంవత్సరం నవంబరు 27న వెటర్నరీ వైద్యురాలిపై మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు నవీన్‌, జొల్లు శివ, చెన్నకేశవులు అనే నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెపై పెట్రోలు పోసి దారుణంగా హతమార్చిన విషయం తెలిసినదే. ఈ క్రమంలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా.. వారు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో ఎన్‌కౌంటర్‌ చేసినట్లు వారు తెలిపిన విషయం అందరికి తెలిసినదే. 

 

అయితే ఇది ఒక అన్యాయమైన ఎన్‌కౌంటర్‌ అని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని మృతుల కుటుంబాల కొరకు ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానంలో పిల్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో... మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన జస్టిస్‌ వికాస్‌ శ్రీధర్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఇక ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో, వారికి న్యాయం జరుగుతుందో లేదో  వేచి చూడవలసి వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: