ప్రస్తుతం భారత దేశంలో కరోనా వైరస్ మెల్లగా విజృంభిస్తుంది. ఇప్పటి వరకు దేశంలో కరోనా నిర్ధారణ అయినవారి సంఖ్య 39కి చేరుకుంది. ఇది ఇలా ఉండగా కరోనా అనుమానిత లక్షణాలతో హాస్పిటల్ లో చేరిన ఇద్దరు మృతి చెందడం కాస్త ఆందోళన చెందాల్సిన విషయమే. జమ్మూ కశ్మీర్ లో ఒకరు, అలాగే పశ్చిమ బెంగాల్ లో మరొకరు శనివారం రాత్రి హాస్పిటల్ లో మృత్యు వాత పడ్డారు. లడఖ్ ప్రాంతానికి చెందిన మాజీ పోలీస్ మొహమద్ అలీ (76) శనివారం రోజు సాయంత్రం లేహ్ లోని ప్రభుత్వ హాస్పిటల్ లో చనిపోయినట్టు అధికారులు తెలిపారు.
కరోనా అనుమానిత లక్షణాలతో హాస్పిటల్ లో చేరాడని, ఆయన గ్రామంలోని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్నా ఆయనకు అనారోగ్య లక్షణాలున్నట్టు మెడికల్ హిస్టరీ తెలుపుతుందని వారు తెలిపారు. ప్రాథమిక పరీక్షల్లో కరోనా వైరస్ ఉన్నట్టు రిపోర్ట్స్ వచ్చినా, తుది నివేదిక కొరకు వారు ఎదురుచూస్తున్నామని తెలిపారు.
లేహ్ ప్రాంత ఆరోగ్య విభాగం అధికారి డాక్టర్ మోతిప్ దోర్జీ మాట్లాడుతూ.. అలీ మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ తో మరణించాడని, ఇంతక ముందు అనారోగ్యానికి గురయ్యాడన్నారు. కనుక మరింత జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో అతడి నమూనాలను ఢిల్లీకి పంపామని ఆయన వివరించారు. అక్కడి వైద్య బృందంతో టచ్ లో ఉన్నామని, రెండు రోజుల్లో పూర్తి నివేదిక వస్తుందన్నారు.
అయితే మృతుడు అలీ ఇటీవలే ఇరాన్ లో పర్యటించాడని, ఆయన ప్రయాణించిన విమానంలోని ఇద్దరికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యిందని విశ్వసనీయ వర్గాలు తెలియచేశాయి. జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి చెందిన ఆ ఇద్దరితో అలీ కాంటాక్ట్ అయినట్టు వారు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు బాధితులు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.
అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ లోని ఐసొలేషన్ వార్డులో ఉంచిన ఒక డయాబెటిక్ పేషెంట్ కూడా మృతి చెందాడు. శుక్రవారమే సౌదీ నుంచి వచ్చిన అతనిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం ఆయన చేరాడు. వైద్యులు ఇచ్చిన వివరాల ప్రకారం, దగ్గుతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న అతడి రక్త నమూనాలను సేకరించి, వాటిని పరీక్షలకు పంపించారు. దీనికి సంబంధించిన రిపోర్టు రాకముందే చనిపోయినట్టు అక్కడి వైద్యులు తెలిపారు. ఈ విషయమై హైల్త్ సర్వీస్ డైరెక్టర్ అజయ్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ, బాధితుడు షుగర్ పేషెంట్ అని, ఇన్సులిన్ తీసుకుంటున్నాడని ఆయన తెలిపారు. సౌదీ నుంచి వచ్చిన అతని దగ్గర ఇన్సులిన్ కోసం డబ్బులు లేవని ఆయన అన్నారు. కాకపోతే చికిత్స కోసం వచ్చిన అతడిని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీలోని ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేశామని తెలిపారు.