ఏపీలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. వరుసపెట్టి ఎంపీటీసీలు... జడ్పీటీసీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు కార్పొరేషన్లు.. ఆ తర్వాత చివరిగా పంచాయతీ ఎన్నికల తర్వాత కాస్త రిలీఫ్ రానుంది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు రాజ్యసభ ఎన్నికల్లో సైతం తమ పార్టీ నుంచి వర్ల రామయ్య పోటీకి పెట్టాలని డిసైడ్ అవడంతో రాజ్యసభ ఎన్నికలకు పోటీ కూడా తప్పడం లేదు. ఇక జగన్ ఇప్పటికే శాసనమండలి విషయంలో బలంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే శాసన మండలి రద్దు అవుతుంది.. అన్న సందేహాలకు చెక్ పెడుతూ శాసనమండలి నుంచి మంత్రి మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ కు రాజ్యసభ సభ్యత్వం కల్పించాలని తీర్మానించడం తో పాటు... ఈ ఇద్దరి పేర్లు అధికారికంగా ప్రకటించడం తో రాజ్యసభకు వీరి ఎంపిక దాదాపు అయింది.
ఈ క్రమంలోనే రాజ్యసభకు ఎంపికైన పిల్లి, మోపిదేవి ఇద్దరు మంత్రి పదవులు వదులుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జగన్ ఈ ఇద్దరి స్థానంలో ఎవరిని తీసుకుంటారు అన్నది వైసిపి వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరు బీసీ వర్గానికి చెందిన నేతలు కావడంతో ఇప్పుడు మరో ఇద్దరు బీసీ ఎమ్మెల్యేల తోనే ఈ రెండు మంత్రి పదవులు భర్తీ చేస్తారా ? లేదా ఇతర వర్గాలకు ఈ మంత్రి పదవి ఇస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది. వాస్తవంగా చూస్తే రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవులు ఆశిస్తోన్న నేతలు చాలా మందే ఉన్నారు.
వీరిలో జగన్ గత ఎన్నికల తర్వాత కేవలం నలుగురికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చి... మిగిలిన వాళ్లకు నామినేటెడ్ పదవులు ఇస్తానని చెప్పారు. ఇక ఇటు శాసనమండలి కూడా రద్దు అవ్వడంతో ఈ సామాజిక వర్గం నుంచే మంత్రి పదవుల కోసం ఎక్కువ పోటీ ఉంది. రోజా లాంటి వాళ్లతో పాటు జగన్ హామీ ఇచ్చిన ఆర్కే లాంటి వాళ్లకు ఈ సారి అయినా మంత్రి పదవి వస్తుందా ? లేదా ? జగన్ మార్క్ ట్విస్ట్ ఏంటి అన్నది చూడాలి.