మనదేశంలో కరోనా రోజు రోజుకు కోరలు చాస్తూ విజృంభిస్తోంది. ముందుగా కేరళ నుంచి ప్రారంభమైన ఈ వైరస్ విస్తరణ ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు పాకుతోంది. ఇక కర్ణాటకలో పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వారం రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అలాగే వారం రోజుల పాటు మాల్స్, సినిమా థియేటర్లు మూసి వేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో పరిస్థితి ఎలా ఉన్నా ? తెలంగాణలో రోజు రోజుకు కరోనా అనుమానిత కేసులు ఎక్కువ అవ్వడంతో సీఎం కేసీఆర్ వెంటనే అలెర్ట్ అయ్యారు. ఈ రోజు అసెంబ్లీలో కరోనా ను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో ? చెప్పడంతో పాటు అనవసర భయాందోళనలు వద్దని.. ప్రతిపక్షాలు ఈ విషయంలో రాద్దాంతం చేయవద్దని చెప్పారు.
ఇదిలా ఉంటే దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో ఆందోళన నెలకొన్న వేళ.. మహారాష్ట్ర ప్రజలను మరింత టెన్షన్ పెట్టే సంఘటన ఒకటి అక్కడ చోటు చేసుకుంది. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న ఐదుగురు నాగపూర్లోని మయో ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తుల నుంచి రక్త నమూనాలు తీసుకుని పరీక్షలు చేస్తున్నారు. దీంతో ఈ ఐదుగురు స్నాక్స్ కోసమని బయటకు వెళ్లి అటు నుంచి అటే జంప్ అయ్యారు.
ఇక ఆసుపత్రి నుంచి పారిపోయిన వాళ్లలో ఇప్పటికే అందరిని గుర్తించి.. వారిలో ఒకరిని తిరిగి హాస్పటల్కు తీసుకు వచ్చామని... నాగపూర్ తహశీల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సూర్యవంశి తెలిపారు. ఇక ఈ ఐదుగురిలో ఓ వ్యక్తికి నెగిటివ్ రిపోర్టు రాగా.. మరో నలుగురు రిపోర్టులు రావాల్సి ఉంది. వీరంతా హాస్పటల్ నుంచి పారిపోయారన్న వార్తలతో ఒక్కసారిగా అంతటా భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పుడు వీరు దొరికారన్న వార్తలతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే కరోనా కలకలం రేగిన ప్రాంతాల్లో మార్చి 30 వరకు పాఠశాలలు, కాలేజీలు, థియేటర్లు, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్ తదితరాలన్నింటినీ మూసివేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆదేశాలు జారీ చేశారు.