ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అధికార వైసీపీకి, సీఎం జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే ఇచ్చాయి. నామినేషన్ల పర్వం ముగియడంతో పాటు మరో వైపు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతోన్న నేపథ్యంలో ఆదివారం ఉదయం ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికలను ఏకంగా ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రటకించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆరు వారాల తర్వాత మళ్లీ కొత్తగా ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని కూడా రమేష్ కుమార్ చెప్పారు. దీంతో అధికార పార్టీ ఇప్పటికే ఏకగ్రీవాల్లో భారీ స్థాయిలో సీట్లు గెలుచుకుని మంచి స్వింగ్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా అధికార పార్టీకే మైనస్ అయ్యిందన్న చర్చలు నడుస్తున్నాయి.
ఇక ఎన్నికల వాయిదాపై జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు గవర్నర్ను కలిసిన అనంతరం ప్రెస్మీట్ పెట్టి ఈసీపై విరుచుకు పడ్డారు. ఇక ఎన్నికల వాయిదా ఆర్డర్ కాపీ కూడా ఎన్నికల సంఘంలో సభ్యులకు తెలియకుండా రెడీ అయ్యిందని చెప్పారు. ఎవడో ఆర్డర్ ఇస్తున్నాడు ? ఎవడో ఆర్డర్ రాస్తున్నాడు ? ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం ప్రభుత్వాన్ని లేదా అధికారులను అడగాలి కదా ? అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ కుమార్కు పదవి ఇచ్చి ఉండవచ్చు.. ఆయనది రమేష్ కుమార్ది ఒకే సామాజిక వర్గం అయ్యి ఉండవచ్చు ? అయినంత మాత్రానా ఇలా చేస్తారా ? జగన్ ప్రశ్నించారు. ఇక మా పార్టీ అభ్యర్థులు ఇప్పటికే భారీ ఎత్తున ఏకగ్రీవాల్లో విజయం సాధించారని... ఈ టైంలో వైసీసీ ఎన్నికలు జరిగితే టీడీపీకీ ఏ మాత్రం విజయం సాధించే అవకాశాలు లేవని... బాబు పరువు పూర్తిగా పోతుందనే వాయిదా వేశారన్నారు.
ఇక ఎన్నికల వాయిదాతో ఏపీకి జరిగే మరో అన్యాయం కూడా జగన్ చెప్పారు. ఎన్నికలు ఈ నెలాఖరులో పూర్తయితే 14వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి దాదాపుగా రు.5 వేల కోట్లు వస్తాయని.. అవి వస్తే ఏపీలో స్థానిక సంస్థలను అభివృద్ధి చేయవచ్చని... అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదన్న కుట్రతోనే ఇదంతా జరిగిందని అర్థమవుతోందని.. బాధ్యత కల అధికారిగా రమేష్ కుమార్ ఇలా ? ఎలా ? చేస్తారని జగన్ ప్రశ్నించారు.