ఏపీలో బాబోరి తెలుగుదేశం పార్టీకి ఒకే రోజు వరుస షాకులు తగిలాయి. గత పది రోజులుగా చూస్తే పార్టీకి చెందిన అనేక మంది కీలక నేతలు పార్టీకి షాక్ ఇచ్చి ఇతర పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఏపీలో చాలా జిల్లాల నుంచి పలువురు కీలక నేతలు వైసీపీలోకి జంప్ చేసేశారు. వీరిలో ఇప్పటికే పార్టీ ఘోరంగా ఓడిపోయి చేతులు ఎత్తేసిన నెల్లూరు జిల్లా నుంచి ఓ కీలక నేత పార్టీ మారిపోయేందుకు రంగం సిద్ధమైంది. నెల్లూరు జిల్లా టీడీపీ అధికార ప్రధానిధి సీ.ఎచ్. హరిబాబు యాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితో మంతనాలు జరిపారు.
ఇక సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డికి పెద్ద షాక్ తగిలింది. ఈ నియోజకవర్గం నుంచి పలువురు టీడీపీ నేతలు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఇక టీడీపీ కంచుకోట అయిన పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే నరేంద్రకు పెద్ద షాక్ తగిలింది. పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకానికి చెందిన 40 కుటుంబాల టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య వారికి పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు.
ఇక పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ గెలిచిన ఉండి నియోజకవర్గంలో కూడా వలసలు ఆగడం లేదు. ఉండి మండలం చిలుకూరులో టీడీపీ ఖాళీ అయింది. మాజీ ఏఎంసీ చైర్మన్ చిలుకూరి నరసింహరాజు, గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు ముదునూరి సోమరాజు, రెండువందల మంది టీడీపీ కార్యకర్తలు ఉండి వైఎస్సార్సీపీ ఇంచార్జి పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఇక పార్టీకి స్ట్రాంగ్ జిల్లా అయిన కృష్ణా జిల్లాలోనూ వరుస షాకులు తప్పడం లేదు. తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం దుందిరాలపాడులో టీడీపీ, కాంగ్రెస్కు చెందిన కీలక నేతలు మండల వైసీపీ కన్వీనర్ చావా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఏదేమైనా ద్వితీయ శ్రేణి కేడర్ అంతా తరలిపోతుండడంతో బాబోరు విలవిల్లాడిపోతున్నారట.