కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అన్ని దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే 19వేల మందికిపైగా ఈ వైరస్తో మృతి చెందారు. సుమారు ఐదులక్షల మంది ఈ వైరస్బారిన పడ్డారు. సాధారణ ప్రజలే కాదు.. దేశాధినేతలు కూడా ఈ వైరస్ మాట వింటే వణికిపోతున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తదితర దేశాల అధినేతలు వైద్యపరీక్షలు చేయించుకోగా నెగటివ్ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా.. ఈ కరోనా వైరస్ బ్రిటన్ రాజకుటుంబాన్ని కూడా తాకింది. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్లెస్కు వైద్యపరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన ఇంటిలోనే ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఈ వార్త బ్రిటన్లోనేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. ప్రిన్స్చార్లెస్ కొద్దిరోజులుగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు కూడా స్కాట్లాండ్లోని బిర్క్హాల్కు వెళ్లారు. సోమవారం వైద్యపరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.
ప్రస్తుతం ఆయన స్కాట్లాండ్లోని ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఈ వార్త ప్రధానంగా బ్రిటన్లో కలకలం రేపుతోంది. బ్రిటన్ రాజకుటుంబాన్ని కూడా కరోనా తాకడంతో ముందుముందు ఎలాంటి కఠిన నిర్ణయాలు ఉంటాయోనని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పటికే యూరప్లో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఆ తర్వాత ఎక్కువగా ఇటలీలోనే ఎక్కువగా ప్రభావం చూపుతోంది. అయితే.. మరణాల సంఖ్యమాత్రం చైనా కంటే ఇటలీలో ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇక్కడ ప్రజలు దీని బారినపడి పిట్టల్లా రాలిపోతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అనేక దేశాలు లాక్డౌన్ విధించాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం లేదు. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ఇక భారత్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి లాక్డౌన్ కొనసాగుతోంది.