జనసేనాని పవన్ కళ్యాణ్ , తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది . కరోనా వైరస్ విస్తృతి నేపధ్యం లో హైదరాబాద్ లోని హాస్టళ్లల లో ఉంటూ ఉద్యోగాలు చేసుకునే యువత , చదువుకునే విద్యార్థులను హాస్టళ్ల యాజమాన్యం ఖాళీ చేయించి స్వస్థలాలకు వెళ్లిపోవాలని సూచించిన విషయం తెల్సిందే . అయితే కరోనా కట్టడి కోసం ఎక్కడి వారు అక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం హాస్టళ్లను యధావిధిగా కొనసాగించాలంటూ యాజమాన్యాలను ఆదేశించింది .
అంతటితో ఆగకుండా విద్యార్థులకు ఐదు రూపాయల భోజనాన్ని ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించింది . ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వం లో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ట్విట్టర్ వేదిక గా జనసేనాని అభినందిస్తూ , కేటీఆర్ ను థాంక్యూ సార్ అంటూ సంభోదించారు . పవన్ ట్వీట్ పై కేటీఆర్ స్పందిస్తూ తనను అభినందించినందుకు ఒకవైపు ధన్యవాదాలు చెబుతూనే , మరొకవైపు మీరు సార్ అని పిలవడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారని ప్రశ్నించారు . తాను ఎప్పుడు సోదరుడినేనని పేర్కొన్నారు . కేటీఆర్ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ కూడా వెంటనే స్పందిస్తూ ఎస్ బ్రదర్ అంటూ తిరిగి సమాధానం ఇచ్చారు .
కరోనా వ్యాధి కట్టడికి కేంద్ర , తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా పవన్ ఇప్పటికే తన వంతుగా ఆర్ధిక సహాయాన్ని ప్రకటించిన విషయం తెల్సిందే . ప్రధాని మంత్రి సహాయనిధి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన పవన్ , ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధి చెరో 50 లక్షల విరాళాన్ని ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు .