దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో మన దేశ శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగాలు చేయడానికి సిద్ధమయ్యారు. కరోనాకు సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం పరిశోధనలు జరుపుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఉన్నతాధికారులు భారీ స్థాయిలో యాంటీ బాడీ పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ఈ పరీక్షల ద్వారా ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారికి కరోనా సోకిందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. 
 
వివిధ పరీక్షలు చేసి కరోనా సోకిందో లేదో నిర్ధారిస్తారు. ఈ యాంటీ బాడీ పరీక్షల్లో ఇంతకుముందే కరోనా గ్రూపునకు చెందిన వైరస్ సోకిందా..? వైరస్ ఎటువంటి లక్షణాలు కనిపించకుండానే సహజంగా తగ్గిపోయిందా...? అనేది తెలుస్తుంది. ఎవరికైనా కరోనా సోకి లక్షణాలు తెలియకుండానే తగ్గిపోయి ఉంటే అందుకు గల కారణాలను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తారు. 
 
రక్తంలో కరోనాను నాశనం చేసే యాంటీబాడీలు ఉంటే వైరస్ పనితీరు గురించి దానిని అంతం చేసే అవకాశాల గురించి మరిన్ని పరిశోధనలు చేసి మంచి ఫలితాలను రాబట్టవచ్చు. ఈ టెస్ట్ ను సీరాలజీ టెస్ట్ అని కూడా పిలుస్తారు. ఐఎంసీఆర్ కరోనా పాజిటివ్ అని తేలినవారి బంధువులకు, సన్నిహితులకు మొదట ఈ పరీక్షలు నిర్వహించనుంది. ఐ.సీ.ఎం.ఆర్ నియమించిన కమిటీ చైర్మన్ రణదీప్ గులేరియా ఈ విషయాలను వెల్లడించారు. 
 
సహజంగా కోలుకున్న వారిని, స్వల్ప ఇన్ఫెక్షన్ సోకిన వారిని యాంటీ బాడీ పరీక్షల ద్వారా సులభంగా గుర్తించవచ్చని ఆయన తెలిపారు. ఇన్ఫెక్షన్ తీరును వారి యాంటీ బాడీలను బట్టి అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఈ టెస్టుల ద్వారా కరోనా లక్షణాలు కనిపించకపోయినా కరోనా సోకిందో లేదో సులభంగా తెలుసుకోవచ్చని చెప్పారు. మరోవైపు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధలు అమలు చేయడంతో కేసుల సంఖ్య తగ్గుతున్న కొన్ని రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదవ్వడం గమనార్హం. 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: