లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. జిల్లాలు, అన్ని రాష్ట్రాల సరిహద్దులను మూసివేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.. నిషేధాక్ఞలు ఉల్లంఘించి, స్వస్థలాలకు బయలు దేరిన కార్మికులకు స్క్రీనింగ్ నిర్వహించి 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచాలని స్పష్టం చేసింది. పని దొరక్క, పూట గడవక ఇబ్బందులు పడటమేగాక, కరోనా భయంతో వణికిపోతూ కాలినడకన సొంత ప్రదేశాలకు వెళ్తున్న వారిని గుర్తించి అధికారులు క్వారైంటైన్కు తరలిస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు బిక్కుబిక్కుమంటూ క్వారంటైన్ కేంద్రాల్లో కాలం వెల్లదీస్తున్నారు.
మహారాష్ట్రలోని నాంథేడ్ తదితర ప్రాంతాల నుంచి సుమారు ఐదు వేలకు పైగా కుటుంబాలు పనుల కోసం మహబూబాబాద్ జిల్లాకు వల వచ్చాయి. ఉన్న ఊరిలో ఉపాధి కరువై బతుకుదెరువు కోసం వలస బాట పట్టిన కూలీలకు కరోనా కష్టాలు తెచ్చిపెట్టింది. ఇక్కడ పని దొరుకుతుందని , నాలుగు మెతుకులు తినొచ్చని భావించారు. అయితే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరోనా ఎఫెక్ట్ తో పని దొరక్క పూట గడవడమే కష్టంగా మారింది. దీంతో దిక్కు తోచక ఇంటి ముఖం పడుదామనుకుంటే రవాణా వ్యవస్థకూడా పూర్తిగా స్తంభించింది. ఈ పరిస్థితుల్లో చేసేది ఏమీలేక పిల్లా పాపలతో వందల కుటుంబాలు కాలినడకన మహారాష్ట్రకు పయనమయ్యాయి. అయితే వీరందరికీ అండగా నిలిచి, అక్కున చేర్చుకున్నారు మంత్రి సత్యవతి రాథోడ్.
పనిలేక, ఎవరూ దగ్గరకు రానీయకుండా వలస కూలీలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని మంత్రి సత్యవతి చలించిపోయారు. వెంటనే స్పందించి కాలి నడకన సొంత ఊళ్లకు వెళ్తున్న వారిని ప్రతక్ష్యంగా కలుసుకుని, వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే అధికారులతో మాట్లాడి వారందరినీ అమనగల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్కు తరలించారు. అంతేగాక రెండు క్వింటాళ్ల బియ్యంతోపాటు, వంట సామగ్రి, రూ.10 వేలు అందజేసి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు. అలాగే ఎక్కడి వారు అక్కడే ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలని, వలస కార్మికుల కుటుంబాలకు ఏ లోటు లేకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు.