ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తున్నది. వేలమందిని బలితీసుకుంటోంది. చైనాలోని వుహాన్నగరం కేంద్రంగా పుట్టిన కరోనా వైరస్.. నేడు దాదాపుగా అన్ని దేశాలను వణికిస్తోంది. ప్రధానంగా యూఎస్, చైనా, జెర్మనీ, స్పెయిన్, ఇరాన్, యూకే, ఫ్రాన్స్ ఇటలీ దేశాల్లోనే ఈ వైరస్ బీభత్స సృష్టిస్తోంది. ఈ క్రమంలో కరోనా వైరస్పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. చైనా కావాలనే కరోనా వైరస్ను సృష్టించిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి చైనా పన్నిన కుట్రలో భాగమే ఈ కరోనా వైరస్ సృష్టి అని పలువురు అంటున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే.. దీనిని చైనా వైరస్ అంటూ మండిపడ్డాడు. ఈ వైరస్ గురించి ముందే చెప్పకుండా చైనా దాచి ఉంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంపై బయోవార్ చేస్తుందంటూ పలువురు విశ్లేషిస్తున్నారు.
ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. చైనా పక్కనే ఉన్న మిత్ర దేశాలు రష్యా, ఉత్తరకొరియాలో కరోనా వైరస్ ప్రభావం లేదని, మళ్లీ దక్షణకొరియాలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందనీ, ఇందులో ఏదో మతలబు ఉందంటూ మరో వాదన.. ఈ వాదనల ఉద్దేశం అంతిమంగా.. ఈ వైరస్ను సృష్టించింది చైనానేనని చెప్పడమే. అంతేగాకుండా.. చైనా వద్ద ఇప్పటికే వైరస్కు వ్యాక్సిన్ కూడా ఉందని, అందుకే వుహాన్ నగరంలో అంత త్వరగా కోలుకుందని, అంతర్జాతీయంగా వ్యాక్సిన్ను మార్కెటైజ్ చేసుకోవడానికి చైనా ఇలా నాటకాలడుతోందని మరికొందరి విశ్లేషణ. ఇక ఇదే సమయంలో మరో వాదనకూడా మొదలైంది. కొన్ని నమ్మలేని నిజాలను చరిత్ర ఆధారంగా పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి.. ఈ ప్రపంచానికి పెద్దన్నగా, ప్రపంచ పోలీస్గా అమెరికా వ్యవహరిస్తోంది. సాంకేతికంగా, ఆయుధ సంపత్తిలో ఎదురులేని శక్తిగా అవతరించింది. ఈ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి అమెరికా ఎంతటి దారుణానికైనా ఒడిగడుతుందని, ఇలా అనేక దేశాలను సర్వనాశనం చేసిందని మరికొందరు వాదిస్తున్నారు.
ఇక్కడే అమెరికా చరిత్రను గుర్తు చేస్తున్నారు. బానిసల రక్తమాంసాలపైన నిర్మితమైన అగ్రరాజ్యం దారుణాలను చెబుతున్నారు. ఆనాడు నల్లరంగు జనాభా అయిన నీగ్రోలను, రెడ్ ఇండియన్లను ఎలా పీడించారో చరిత్ర చెబుతోంది. రెడ్ ఇండియాన్ల మీద దాడి చేసి, వాళ్లను హతమార్చి భూములను లాక్కున్నారు అమెరికా సైన్యాధిపతులు. రెడ్ ఇండియన్లను చంపేందుకు క్రూరమైన పద్ధతులను ఎంచుకున్నారు. అందులో ఒకటి ఏమిటంటే.. రెడ్ ఇండియన్ గ్రామాల సమీపంలో దుప్పట్లు ఉంచడం. అమాయకులైన రెడ్ ఇండియన్లు ఆ దుప్పట్లను తీసుకుని వాడుకుంటారు. త్వరలోనే వాళ్లు అసంఖ్యాకంగా మరణిస్తారు. ఆ దుప్పట్లు అంతకుముందు మశూచి రోగులు ఉపయోగించినవి. ఆ రోగంతో మరణించిన వాళ్ల మీద కప్పడానికి ఉపయోగించినవి. ఇలా 19వ శతాబ్ది నాటికే అమెరికా మిలిటరీ కొన్ని అమానుషమైన క్రిమి యుద్ధ పద్ధతులను అలంభించిందని, చంపదల్చుకున్న వాళ్ల మీదకి విష క్రీముల్ని వదిలేదని పలువురు చరిత్రకారులు చెబుతున్నారు.