కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకోవడానికి ఫోన్ చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అడిగిన పలు అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. నిజానికి.. కరోనా కోరలు సాస్తున్న కాలంలోనూ ముఖ్యమంత్ర జగన్ అనివార్యపరిస్థితుల మధ్య పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంపై ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం.. ప్రధాని మోడీ ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫోన్ చేశారు. ఏపీలో కోవిడ్–19 కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఇరువురు చర్చించారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి గల కారణాలను ప్రధాని మోడీకి జగన్ వివరించారు.
ఆ తర్వాత రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను మోడీ దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్లారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని, కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై ఇటీవలే లేఖ రాశానని ఆయన గుర్తుచేశారు. అంతేగాకుండా.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.2,100 కోట్లు, పౌర సరఫరాల శాఖకు సంబంధించి రూ.2,200 కోట్లు.. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు రూ.1,100 కోట్లు, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ.1,050 కోట్లు, జీఎస్టీ పరిహారం కింద రూ.900 కోట్లు ఇప్పించాల్సిందిగా ప్రధానిని వైఎస్ జగన్ కోరారు. అయితే.. దీనిపై ప్రధాని సానుకూలంగా స్పందిస్తూ..ఆ లేఖలోని అంశాలు తన దృష్టికి వచ్చాయని, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అయితే.. ఇంతటి కష్టకాలంలోనూ ప్రధాని మోడీ దృష్టికి జగన్ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను తీసుకెళ్లడంపై ప్రజల నుంచి ఎక్కువగా సానుకూల స్పందనే వస్తోంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రజల ఇబ్బందులను తీర్చేందుకు కేంద్రం కూడా సాయం అందించాలంటూ పలువురు ఈసందర్భంగా జగన్కు మద్దతు తెలుపుతున్నారు. ఇక ఇదే సమయంలో మరోవాదన కూడా వినిపిస్తోంది. ఒకవైపు కరోనా దేశంలో కలకలం రేపుతుంటే.. ఇలా ఏపీకి రావాల్సిన నిధుల గురించి మాట్లాడడం సరికాదని పలువురు అంటున్నారు. ఏపీలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముందుగా సీఎం జగన్ దృష్టిసారించాలని సూచిస్తున్నారు.