కరోనా విస్తృతి నేపధ్యం లో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడం తో నెలకొన్న ఆర్ధిక ఇబ్బందులను అధిగమించేందుకు మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల ఎంపీల పరిస్థితి ముందు నుయ్యి - వెనుక గొయ్యి అన్న చందంగా తయారయింది . ప్రధాని నరేంద్ర మోదీ తో సహా ఎంపీల జీతాల్లో కోతవిధించాలని కేంద్రం నిర్ణయించింది . జీతాల్లో కోత విధించడాన్ని ఎంపీలు ఎవరు పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదట ... కానీ రెండు ఏళ్లపాటు ఎంపీ నిధులకు కోత విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వారికి ఏమాత్రం రుచించడం లేదని తెలుస్తోంది .
ప్రతి ఎంపీ కి ఏటా ఐదుకోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నారు . నిబంధనల మేరకు ఈ నిధుల్ని ఎంపీలు ఎక్కడైన అభివృద్ధి పనులకు కేటాయించే వెసులుబాటు కల్పించారు . ఇదే అదనుగా కొంతమంది లోక్ సభ సభ్యులు తమ నియోజకవర్గం కాకపోయినా, ఇతర ప్రాంతాల అభివృద్ధి కోసం నిధుల కేటాయించడం విమర్శలకు తావునిస్తోంది . ఇక కొంతమంది ఎంపీలు తమ నిధులను సొంత డబ్బులున్నట్లుగా విరాళాలు ప్రకటించడం కూడా తెల్సిందే .
కేంద్ర ప్రభుత్వం తొలుత ప్రతి ఎంపీ కి కేవలం ఐదు లక్షల రూపాయల నిధులు కేటాయించగా , ఆ తరువాత వాటిని రెండు కోట్లకు పెంచారు . ప్రస్తుతం ఒకొక్క ఎంపీకి ఏడాదికి ఐదు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు . దీనితో రెండేళ్లపాటు ఎంపీ నిధులకు కోత విధించడమంటే ఒకొక్క ఎంపీ పది కోట్ల రూపాయల నిధులు దక్కకుండా పోనున్నాయి .