దేశమంతా కరోనా కలకలం నెలకొన్న తరుణంలో మహారాష్ట్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్లో గడిచిన 24 గంటల్లో 549 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి 166 మంది మృతి చెందినట్లు ఆయన తెలిపారు. నిన్న ఒక్కరోజే 17 మంది చనిపోయారు. మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5734కు చేరిందని అగర్వాల్ పేర్కొన్నారు.
ఇలా దేశంలో కలకలం నెలకొన్న తరుణంలో సీఎం ఉద్ధవ్ థాక్రేను ఎమ్మెల్సీగా నియమించాలని గవర్నర్ను మహారాష్ట్ర కేబినెట్ కోరింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని గురువారం ఆమోదించింది. ఉద్ధవ్ థాక్రే కే సంబంధించిన నిర్ణయం కావటంతో కేబినెట్ భేటీకి ఆయన హాజరుకాలేదు. కరోనా ఎఫెక్ట్ కారణంగా మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఉద్ధవ్ థాక్రేకు కష్టం వచ్చి పడింది. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు కావస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి ఉద్ధవ్ ఎమ్మెల్యే గానీ ఎమ్మెల్సీ కానీ కాదు. దీంతో ఆరు నెలల్లో ఆయన ఏదో ఒక చట్ట సభకు ఎన్నిక కావల్సి ఉంది. లేదంటే సీఎం పదవికి రిజైన్ చేయాల్సిందే. ఈ నెలలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనను శాసన మండలికి ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడటంతో సర్కార్కు దిక్కుతోచని స్థితి ఎదురైంది. దీంతో ఉద్ధవ్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని గవర్నర్ ను కేబినెట్ కోరింది.
శివసేనకు చెందిన థాక్రే కుటుంబంలో ఈ పదవిని మొదటిసారిగా చేపట్టింది. దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్క్ లో 18 వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేను సీఎం అభ్యర్థిగా మిత్రపక్షాలు ఎన్నుకున్న సంగతి తెలిసిందే. మహావికాస్ అఘాడీని ఆయనే నడుపుతారని కాంగ్రెస్, ఎన్సీపీ ప్రకటించాయి. మహా వికాస అఘాడీ కూటమి భేటీ కాగా అధికార భాగస్వామ్యం మీద చర్చించి నిర్ణయం తీసుకున్నాయి. ఎన్సీపీ, కాంగ్రెస్లకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడానికి శివసేన అంగీకరించింది. ఎన్సీపీ రథసారథి శరద్ పవార్ శిబిరానికి తిరిగొచ్చిన అజిత్ పవార్కే మళ్లీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు.