తనకు భద్రత కల్పించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ కు గతం లో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ ఆయన రాసింది కాదని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు . కేంద్ర హోంశాఖ కు , ఆ లేఖ తెలుగుదేశం పార్టీ నాయకులు రాశారని అన్నారు . కేంద్ర హోంశాఖ కు రమేష్ కుమార్ రాసినట్లుగా చెబుతున్న లేఖ లో ఆయన సంతకం ఫోర్జరీ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు . ఈ మేరకు ఆ లేఖపై విచారణ జరిపించాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు విజయసాయి రెడ్డి లేఖ రాశారు .
అయితే విజయసాయి ఆరోపణలను ఖండిస్తూ , కేంద్ర హోంశాఖ కు ఆ లేఖ తానే రాసినట్లుగా రమేష్ కుమార్ స్పష్టం చేశారు . దీనితో ఒక్కసారిగా విజయసాయి రెడ్డి , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆత్మరక్షణ లో పడినట్లయింది . అయితే ఆ లేఖలో సంతకం చేసింది ఎవరో , ఏ ఐపీ అడ్రస్ ద్వారా హోంశాఖ కు మెయిల్ చేశారో చెప్పాలంటూ విజయసాయి డిమాండ్ చేయడం ద్వారా , రమేష్ కుమార్ ను ఆత్మరక్షణ లోకి నెట్టాలన్నదే విజయసాయి ఎత్తుగడ గా కన్పిస్తోంది . కేంద్ర హోంశాఖకు రమేష్ కుమార్ గతం లో లేఖ రాసినట్లుగా, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ధృవీకరించారు . రమేష్ కుమార్ కు భద్రత పెంచుతామని కూడా ఆయన ప్రకటించారు .
ఇప్పుడు ఆ లేఖ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి టీడీపీ ని , మాజీ ఎన్నికల కమిషనర్ ను ఆత్మరక్షణలోకి నెట్టాలని భావించిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం , ప్రత్యేకించి విజయ సాయి ఆత్మరక్షణ లో పడిపోయారు . ఇప్పటికే రమేష్ కుమార్ ఆ లేఖ తానే రాశానని పేర్కొనగా , రమేష్ కుమార్ తమకు లేఖ రాశారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి చెప్పిన మాటల్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా బీజేపీ నాయకత్వం తో కోరి విజయసాయి శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నట్లయిందన్న వాదనలు విన్పిస్తున్నాయి .