ఏప్రిల్ 20వ తేదీ తర్వాత తెలంగాణలో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందా..? ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారా..? ఈ నేపథ్యంలోనే ఈనెల 19న రాష్ట్రమంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారా..? అంటే తాజా పరిణామాలు మాత్రం ఔననే అంటున్నాయి. తెలంగాణలో కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో ప్రస్తుతం కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్డౌన్ను మే 3వ తేదీ వరకు యథావిధిగా కొనసాగించడమా? లేక కేంద్ర ప్రభుత్వ ఆలోచన ప్రకారం ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వడమా? అనే అంశాలపై చర్చించి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి.. కేంద్ర ప్రభుత్వం కన్నా ముందే తెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 24 తర్వాత తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తగ్గే అవకాశం ఉందని చెప్పారు. కానీ, హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా మే 3వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ను పొడిగించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 20వ తేదీ తర్వాత లాక్డౌన్ అమలులో కొన్ని సడలింపులు కూడా ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అయితే.. తెలంగాణలో లాక్డౌన్ అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ సడలింపులు ఇస్తారా..? లేక మరింత కట్టుదిట్టంగా కొనసాగిస్తారా..? అన్న ప్రశ్నలు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి. ఈ నెల 19న మధ్యాహ్నం 2:30గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం అవుతుంది. అంటే.. అదే రాత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.