బుద్దా వెంకన్న...టీడీపీలో ఫైర్ బ్రాండ్ నాయకుడు. టీడీపీని గానీ, చంద్రబాబుని గానీ ఏమైనా అంటే వెంటనే స్పందించే నేతల్లో వెంకన్న ముందుంటారు.  ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబుకు భక్తుడు. అయితే ఇలా చంద్రబాబు భక్తుడిగా ఉన్న వెంకన్న...జగన్, విజయసాయిరెడ్డిలని వ్యక్తిగతంగా టార్గెట్ గా చేసుకుని ఎప్పుడూ విమర్శలు చేస్తుంటారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుని ఏమన్నా అంటే వెంటనే లైన్ లోకి వచ్చి కౌంటర్లు ఇచ్చేస్తారు.

 

ఈ క్రమంలోనే తాజాగా కూడా వెంకన్న జగన్, విజయసాయిలపై విమర్శలు చేశారు. అయితే ఏమైందో తెలియదుగానీ, వైసీపీ కార్యకర్తలు తమ నాయకులని ఏమన్నా అంటే చంపేస్తామని ఫోన్లో తనని బెదిరిస్తున్నారని, అలాగే సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని మీడియాకు లేఖ రాసారు. అయితే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే. కానీ ఆ విమర్శలు వ్యక్తిగతంగా ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయి. వెంకన్న మరీ వ్యక్తిగతంగా పెట్టుకుని మాట్లాడటంతోనే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని తెలుస్తోంది.

 

లేకపోతే అనేక మంది టీడీపీ నేతలతో రాని సమస్య ఒక్క వెంకన్నతోనే వైసీపీ కార్యకర్తలకు ఎందుకు వస్తుంది.  ఇక సోషల్ మీడియాలో పోస్టులు గురించి వస్తే, ఇప్పుడు అన్ని పార్టీల వారు హద్దుల్లేకుండానే విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే వెంకన్నపై  వైసీపీ కార్యకర్తల బెదిరింపులని టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కూడా స్పందిస్తూ...బీసీల‌ జోలికొస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదని, బీసీ నాయ‌కుడు బుద్ధా వెంక‌న్న‌పై క‌క్ష సాధిస్తున్న రెడ్డి స‌ర్కారు నియంత పోక‌డ‌ల‌ను ఎదిరిస్తామని, ఫోన్ చేసి చంపేస్తామ‌ని బెదిరిస్తున్నారంటే రాష్ట్రంలో ఎంత అరాచ‌కం రాజ్య‌మేలుతుందో అర్థ‌మ‌వుతోందని నాలుగు డైలాగులు వేశారు.

 

ఈ డైలాగులకు వైసీపీ నుంచి గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. బెదిరింపులు గురించే చింతమనేనినే చెప్పాలని, గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చింతమనేని ఎన్ని అరాచకాలు చేసారో అందరికి తెలుసని, ఎమ్మెర్వోపై దాడి ఎవరు మరిచిపోరని అంటున్నారు. గత ఐదేళ్లు కమ్మ సర్కార్ ఎన్ని అరాచకాలు సృష్టించిందో తెలుసంటూ కౌంటర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: