వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ట్విట్టర్ వేదికగా మరోమారు వ్యంగాస్త్రాలు సంధించారు. విశాఖ కరోనా కేసుల సంఖ్యను ఏపీ ప్రభుత్వం దాస్తోందంటూ టీడీపీ అనుకూల మీడియా, చంద్రబాబు చేసిన ఆరోపణలు అసత్యమని ఋజువయ్యాయని వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ఖాతా నుండి వరుస ట్వీట్లు చేశారు. 
 
విజయసాయిరెడ్డి "వైజాగ్ లో కరోనా కేసులు దాచిపెడుతున్నారని చంద్రబాబు, పచ్చ మీడియా దుర్మార్గపు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న నియంత్రణ చర్యల వల్లే అక్కడ వ్యాధి పెద్దగా ప్రబలలేదని వెల్లడించి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి బాగా గడ్డి పెట్టాడు. బాబూ! మీ ఏడుపులు ఆగవు, బుద్దులు మారవు." అని ట్వీట్ చేశారు. గత వారం రోజుల నుంచి విశాఖలో కరోనా కేసులపై టీడీపీ విమర్శలు చేస్తూనే ఉంది. 
 
వైసీపీ నేతలు ఖండిస్తున్నా  టీడీపీ అనుకూల మీడియా పదేపదే ఇదే తరహా ఆరోపణలు చేస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి విశాఖలో కరోనా కేసుల గురించి క్లారిటీ ఇచ్చారు. మరో ట్వీట్లో "మీడియాలో కనిపించక పోతే బతకలేడు చంద్రబాబు. ఠంచనుగా రోజుకోసారి వీసీల పేరుతో వాయిస్తున్నాడు. ఆయన ఏం చెబుతున్నాడో కానీ క్షేత్ర స్థాయిలో పచ్చపార్టీ పెద్ద నాయకులెవరూ సేవా కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ప్రచార పిచ్చి ముదిరి ఆయనిలాగే సోది వేస్తాడులే అని ఉదాసీనంగా ఉన్నట్టున్నారు" అని సెటైర్లు వేశారు. 

 

విజయసాయిరెడ్డి టీడీపీ అనుకూల మీడియాపై కూడా విమర్శలు చేశారు. టీడీపీ అనుకూల మీడియాను చీ కొడుతున్నారని బాబుకు కూడా తెలిసిపోయిందని అన్నారు. బాబు జీవితమంతా మ్యానిప్యులేషన్లే కదా అని విమర్శించారు. ఒకసారి క్రెడిబులిటీ కోల్పోతే చెల్లని రూపాయితో సమానం అని విమర్శలు చేశారు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: