సాధారణంగా ఒక పార్టీలో ఉన్న నేతలు అదే పార్టీలోని మరో నేతపై ఆరోపణలు, విమర్శలు చేయడం అరుదుగా జరుగుతుంది. మహిళా నేతలైతే మరో మహిళా నేతపై విమర్శలు చేయడం మరీ అరుదు. కానీ బీజేపీ పార్టీలో ఇద్దరు మహిళా నేతల మధ్య వైరం మొదలైంది. నటి, బీజేపీ నేత మాధవీలత కొన్ని నెలల క్రితం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సాధినేని యామినిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
యామిని పచ్చ కండువా కప్పుకున్నన్ని రోజులు బీజేపీపై విమర్శలు చేసి.... టీడీపీ అధికారంలో లేకపోవడంతో బీజేపీలో చేరారని అన్నారు. తాజాగా యామినికి అధికార ప్రతినిధి పోస్ట్ ఇవ్వడంతో మాధవీలత మండిపడ్డారు. పార్టీ కోసం పని చేసిన వారికి విలువ ఇవ్వడం లేదని... మల్లెపూల సువాసన గురించి మాట్లాడిన వారికి అధికార పార్టీ ప్రతినిధి పోస్ట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పనికిమాలిన తిట్లు తిడితేనే పదవులు ఇస్తారని తెలిస్తే తాను కూడా మరో పార్టీ కండువా కప్పుకునేదానినని అన్నారు. 
 
పచ్చ కండువాలు కప్పుకుని వచ్చిన వాళ్లకే బీజేపీలో గౌరవం దక్కుతోందని.... పార్టీ కోసం కష్టపడుతున్న వారికి గౌరవం దక్కడం లేదని చెప్పారు. ఎవరు ఖండించినా సరే తనకు నిజాన్ని చెప్పే ధైర్యం ఉందని.... ఎవరు అడ్డొచ్చినా ఎదుర్కొనే సత్తా ఉందని తెలిపారు. అమ్మలూ బాబులూ బీజేపీని బాగా తిట్టి పార్టీలో చేరితే మంచి పదవులు లభిస్తాయని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 
 
సాధినేని యామిని పేరు ప్రస్తావించకపోయినా మాధవీలత చేసిన పోస్ట్ చూస్తే ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది. ఈ పోస్ట్ చూసిన యామిని షాక్ అయినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీ నేతలైతే ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న యామిని వెంటనే స్పందించి ఉండేది కానీ సొంత పార్టీ మహిళా నేతే ఆరోపణలు చేయడంతో యామిని ఆ పోస్ట్ గురించి స్పందించలేకపోయింది. మాధవీలత బీజేపీపై కూడా విమర్శలు చేయడంతో ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: