ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నాలు ఫలించాయి. విదేశాల్లో చిక్కుకున్న ఆంధ్రులను నేరుగా ఇక్కడికే తరలించాలని ఆయన ఇటీవల కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి, నేరుగా విమానాలకు ఆంధ్రకు నడిపించనున్నట్లు తెలిపింది. మొదటి దశ వందేభారత్ మిషన్లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న తెలంగాణవాసులతోపాటు ఏపీవాసులను కూడా నేరుగా హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించింది. అక్కడి నుంచి అందరినీ హైదరాబాద్లోని వివిధ హోటళ్లలో ఏర్పాటు చేసిన పెయిడ్ క్వారంటైన్లకు తరలించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే.. ఈ పెయిడ్ క్వారంటైన్లలో ఎదురవుతున్న ఇబ్బందులను పలువురు ఏపీవాసులు మీడియా దృష్టికి తీసుకొచ్చారు. తాము విదేశాల నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో చిక్కుకుపోయామని, విమానానాలను నేరుగా ఏపీకే నడిపించాలని కోరారు.
దీనిపై స్పందించిన సీఎం జగన్ వెంటనే చర్యలు తీసుకున్నారు. గల్ఫ్ నుంచి వచ్చే వారికి పెయిడ్ క్వారంటైన్లలో ఉండే స్థోమత లేదని, నేరుగా విమానాలను ఆంధ్రకు నడిపించాలని కోరారు. దీనిపై కేంద్రం నుంచి శుభవార్త వచ్చింది. హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి రెండో దశ వందేభారత్ మిషన్ వివరాలను వెల్లడిస్తూ ఈ విషయాన్నిచెప్పారు. రెండో దశ వందే భారత్ మిషన్కు కేంద్రం అన్ని సన్నాహాలు పూర్తి చేసిందని తెలిపారు. ఇందులో భాగంగా మే 16 నుంచి 22 వరకు సుమారు 149 విమానాలను వివిధ దేశాలకు పంపనున్నట్టు తెలిపారు. రెండో దశలో భాగంగా తెలంగాణకు 16, ఆంధ్ర ప్రదేశ్కు 9, కర్ణాటక–17, కేరళ–31, ఢిల్లీ–22, గుజరాత్–14, రాజస్తాన్–12, పంజాబ్–7 బిహార్, ఉత్తరప్రదేశ్లకు 6 చొప్పున, చండీగఢ్–2 మహారాష్ట్ర–1 మధ్యప్రదేశ్–1, జమ్మూకశ్మీర్–1 చొప్పున విమానాలు కేటాయించినట్టు ఆయన వెల్లడించారు.
యూఏఈ, ఆస్ట్రేలియా, ఖతార్, ఇండోనేసియా, సింగపూర్, అమెరికా, కెనడా, బ్రిటన్, సౌదీ అరేబియా, ఉక్రెయిన్, కజకిస్తాన్, ఒమన్, మలేసియా, ఫిలిప్పీన్స్, రష్యా, ఫ్రాన్స్, ఐర్లాండ్, జపాన్, జార్జియా, కువైట్, జర్మనీ, తజకిస్తాన్, బహ్రెయిన్, ఆర్మేనియా, థాయిలాండ్, బెలారస్, నైజీరియా, ఇటలీ, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి భారతీయులను తరలించనున్నట్టు తెలిపారు.