కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభమైన లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ భారీ ప్యాకేజీలు అంటూ ప్రకటనలు చేస్తూ ప్రజలను మాయలో ముంచుతోందా ? అన్న సందేహాలు కలుగుతున్నాయి. మొన్న ప్రధానమంత్రి మోదీ వచ్చారు.. రు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అని లెక్కలు చదివేసి వెళ్లిపోయారు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత రెండు రోజులుగా మీడియా ముందుకు వచ్చి సుదీర్ఘంగా ఏవేవో అంకెలు చదువుకుంటూ పోతున్నారే తప్పా సామాన్యుడికి ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు.
ఇప్పటికే నిర్మలమ్మ రెండు రోజులు చదివి వెళ్లగా.. ఇక తాజాగా మూడో రోజు కూడా అంకెలను చదివేందుకు మీడియా ముందుకు వస్తున్నారట. ఇక తొలి రోజు రు. 6 లక్షల కోట్ల రూపాయల వివరాలు ఆమె చెప్పారు. వాస్తవంగా అందులో ప్రత్యక్షంగా ప్రజలకు కలిగే లబ్ధి అయితే లేదు. ఇక కేంద్రం, నిర్మలమ్మ భారీ ప్యాకేజీల ప్రకటనలు చేసినా దేశం దద్దరిల్లి పోలేదు. ఎందుకంటే అవి అమల్లోకి వచ్చేసరికి నీటి మీద రాతలే అన్నది చాలా రాష్ట్రాల సీఎంల సందేహం. ఇక ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా విరుచుకు పడుతున్నారు.
ఇక సీఎం కేసీఆర్ సైతం కేంద్రం తీరుపై తీవ్ర గుస్సాతో ఉన్నారు. అటు కేజ్రీవాల్ నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలది అదే దారి. ఇక ఇప్పుడు ఏపీ సీఎం జగన్ సైతం ఈ విషయంలో తీవ్ర అసహనంతో ఉన్నట్టు సమాచారం. కరోనా నేపథ్యంలో ఎక్కడికక్కడ నిబంధనలు కఠినతరం చేస్తూ కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కష్టపడిందని.. అయితే ఇప్పుడు కేంద్రం ఏదో ప్యాకేజ్ రిలీజ్ చేస్తామని లెక్కలు చెపుతున్నా అవి రాష్ట్రాలకు ఎంత వరకు చేరుతాయన్నది ముఖ్యమంత్రులకే అర్థం కాని పరిస్థితి.
ఈ క్రమంలోనే జగన్ ప్రెస్మీట్ పెట్టడమా లేదా ప్రెస్నోట్ ద్వారా అయినా కేంద్రం ప్యాకేజీ గమ్మత్తు గుట్టును రట్టు చేసేందుకు రెడీ అవుతున్నట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరగాలని, వీలైతే వాళ్లకు ఆర్థిక సాయం అందించాలని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. అయితే మోడీ ప్రభుత్వానికి అవేం పట్టడం లేదు. మరి జగన్ మోదీ, కేంద్రం ప్యాకేజీ పై ఎలా ఎటాక్ చేస్తాడో ? చూడాలి.