టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకో మౌనంగా ఉండి పోతున్నారు. మూడు నాలుగు రోజులుగా అస్సలు మాట్లాడటం లేదు. సోషల్ మీడియాలోనూ పెద్దగా పోస్టులేమీ పెట్టడం లేదు. అదేమిటీ..కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి జగన్ సర్కార్ తీవ్రంగా కృషి చేస్తున్నా.. పదేపదే తప్పుబట్టిన చంద్రబాబు ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారేమిటని అనుకుంటున్నారా.. ఇక్కడో విషయం ఉందండి.. కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంపై మాటల యుద్ధం నడుస్తోంది. కృష్ణా జలాల వినియోగానికి పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన 203 జీవోను ఏపీ సర్కార్ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతానికి సాగునీటిని అందించడానికి ఈ జీవోను జారీ చేశారు.
అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ జీవోను వ్యతిరేకిస్తోంది. తమను సంప్రదించకుండానే ఏపీ సర్కార్ ఈ జీవోను తీసుకొచ్చిందని.. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దెబ్బ తీస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. దీనిని అడ్డుకుని తీరుతామని.. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఇప్పటికే కృష్ణా బోర్డులో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. అయితే ఏపీ సీఎం జగన్ కూడా దీనిపై స్పందించారు. కృష్ణా జలాల వినియోగం ఏపీ ప్రజల హక్కు అని, తెలంగాణకు అన్యాయం చేసేలా జీవోను తీసుకు రాలేదని, మానవతాదృక్పథంతో ఆలోచించాలని స్పష్టం చేశారు.
ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే.. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం విషయంలో మాత్రం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం నోరు మెదపడం లేదు. ఇంత రాద్దాంతం జరుగుతున్నా చంద్రబాబు మాత్రం ఇప్పటివరకు ఏమీ మాట్లాడటం లేదు. చంద్రబాబు సైలెంట్ గా ఉండడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిపడుతున్నాయి. అలాగే మిగతా టీడీపీ నాయకులు కూడా స్పందించడం లేదు. దీంతో ఏపీ ప్రజల హక్కులు టీడీపీకి అవసరం లేదా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ముందుముందు అయినా చంద్రబాబు మాట్లాడుతారో లేదో చూడాలి మరి. స్పందించపోవడంలో ఆంతర్యం ఏమిటో మరి..!