తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇందులో ప్రధానంగా కరోనా మహమ్మారి కుటుంబాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైరస్ తీవ్రతను బట్టి మొదటి నుంచీ కంటైన్మెంట్ జోన్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీ చర్యలు తీసుకుంటుండడంతో సామాజిక వ్యాప్తి చెందలేదు. అయితే.. ఇదే సమయంలో కుటుంబంలో ఒకరికి సోకితే వారి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుండడంతో ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంటోంది. ఇలా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 485 కుటుంబాలు కరోనా బారినపడ్డాయి. ఆయా కుటుంబా ల వల్లే రాష్ట్రంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న హైదరాబాద్లోనే 168 కుటుంబాలు వైరస్ బారినపడ్డాయి. ఆ తర్వాతి స్థానంలో రంగారెడ్డి జిల్లాలో 59 కుటుంబాలు, మేడ్చల్ మల్కాజిగిరి 39, నిజామాబాద్ 30, వరంగల్ అర్బన్ 26, సూర్యాపేట జిల్లాలో 25 కుటుంబాల్లో కరోనా ప్రభావం చూపించిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
కాగా, శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం పరిధిలో తండ్రి (40), కొడుకు (7)లకు పాజిటివ్గా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో శనివారం కొత్తగా 55 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇందులో జీహెచ్ఎంసీలోనే 44 మంది బాధితులు ఉన్నారు. ఇటీవల వలస కూలీలు, కార్మికుల రాకపో మరిన్ని ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. లాక్డౌన్తో నిలిచిపోయిన కొన్ని వైద్య సేవలను పునరుద్ధరించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ దవా ఖానల్లో అన్ని రకాల వైద్యసేవలను అందించాల ని వైద్యశాఖ సూచించింది. బోధన, స్పెషాలిటీ దవాఖానల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలతో పాటు అన్ని వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావాల ని సూచిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం.. ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే సాధారణ రోగుల్లో కరోనా లక్షణాలు కనిపించని వారిలో కొందరికి నిర్ధారణ పరీక్ష చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఇక నుంచి పరీక్షలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.