భారత్లో చాలావరకు జైళ్లు సామర్థ్యానికి మించి ఖైదీలతో నిండిపోయి ఉన్న విషయం తెలిసిందే. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖైదీలను జైళ్ల శాఖ అధికారులను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నారు. అక్కడక్కడ కొంతమంది ఖైదీలు వైరస్ బారినపడడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. వైరస్ వ్యాప్తి మరింతగా పెరిగితే.. పరిస్థితి అదుపుతప్పుందన్న భావనకు వచ్చిన జైళ్లశాఖ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైరస్ బారి నుంచి బయటపడేందుకు తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఖైదీలను బెయిల్పై విడుదల చేయాలన్న నిర్ణయాన్ని హైకోర్టుకు సూచించింది. రిమాండ్ ఖైదీలు, అండర్ ట్రయల్ ఖైదీలకు కరోనా నుంచి విముక్తి కల్పించేందుకు వారికి వెంటనే బెయిల్ ఇవ్వడం ఒక్కటే మార్గమని పేర్కొన్నది. తమిళనాడు ప్రభుత్వ సూచన మేరకు హైకోర్టు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్ల నుంచి దాదాపు ఆరు వేల మందికి బెయిల్ మంజూరుచేసింది.
బెయిల్ దొరికిన వారు బయటకు వెళ్లిపోతే సెంట్రల్జైలు, ఐదు మహిళా జైళ్లతో కలిపి మొత్తం 135 జైళ్లలో కేవలం 13,500 మంది ఖైదీలు ఉంటారని జైళ్ల శాఖ స్పష్టంచేసింది. తమిళనాడులోని అన్నిజైళ్లలో మౌలిక సదుపాయాలు బాగానే ఉన్నాయని అధికారులు చెప్పారు. కరోనా వైరస్ కేసులు వెలుగు చూడకముందు జైళ్ల నుంచి బయటకు వెళ్లినవారి సెలవును జూన్ ఒకటో తేదీ వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. కాగా, సందర్శకుల రద్దీని తగ్గించేందుకు అన్ని జైళ్లలో స్మార్ట్ఫోన్లు అందించగా.. కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు ఖైదీలకు వీడియో కాల్ సౌకర్యం అందుబాటులో ఉంచారు. ఒక్క తమిళనాడేగాకుండా.. దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రలోనూ ఖైదీల విడుదలకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిగతా దేశాల్లోనూ రద్దీ ఎక్కువగా ఉన్న జైళ్లలో ఖైదీలను బెయిల్పై విడుదల చేస్తున్నారు. దీంతో ఖైదీలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.