తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో పోరాటం మొదలు పెట్టారా..? ఇక నుంచి తీవ్ర స్థాయిలో విరుచుకుపడనున్నారా..? ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మరోసారి రెచ్చిపోనున్నారా..? అంటే తాజా పరిస్థితులు మాత్రం అవుననే అంటున్నాయి. అసలు కేంద్రంతో కేసీఆర్ పోరాడాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నారా..? ఇందుకు బలమైన కారణాలే ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఒకసారి ఆ విషయాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం.. నిజానికి కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ విరుచుకుపడడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అనేక మార్లు కేంద్రాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తికి లోనవుతునట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు ఉద్దీపన ప్యాకేజీలలో రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ విషయంపై ఇప్పటికే కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక మొన్న రెండో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనతో ఆయన మరింతగా అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.
రుణాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం సరిగా లేదని ఆయన అంటున్నారు. అంతేగాకుండా.. టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కూడా కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ ప్యాకేజీ అంతా బూటకమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. వాస్తవంగా ఈ ప్యాకేజీలో కేంద్రం ఇస్తున్నది రూ.3,20,902 కోట్లు మాత్రమేనని, మిగిలినదంతా రిజర్వ్ బ్యాంకు, వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, నాబార్డు ద్వారా సమకూర్చే రుణపథకాలే ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ జీడీపీలో 10శాతం అంటూ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన అనంతరం ఈ నెల 13వ తేదీనుంచి ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించిన వివరాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. జీడీపీలో ఉద్దీపన ప్యాకేజీ విలువ 10 శాతం అని చెప్తున్నప్పటికీ నిజమైన వ్యయం కేవలం 1.5 శాతం మాత్రమే అవుతుందని ఆయన విమర్శించారు.