తెలంగాణలో రైతులు ప్రభుత్వం నిర్దేశించిన పంటలే పండించాలని, అప్పుడే సరైన ధర లభిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈసారి వరి 40 లక్షల ఎకరాల్లో పండించాలని, పత్తి 70 లక్షల ఎకరాల్లో పండించాలని ఆయన సూచించారు. అలాగే.. 15 లక్షల ఎకరాల్లో కంది, 2 లక్షల ఎకరాల్లో కూరగాయలు, పసుపు 1.25 లక్షల ఎకరాల్లో పసుపు, మిర్చి 2.5 లక్షల ఎకరాల్లో పండించాలని అన్నారు. ఇక సోయాబీన్ 3.35 లక్షల ఎకరాల్లో పండించాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ పంటల ప్రత్యేకతలను కేసీఆర్ వివరించారు. తెలంగాణలో పండుతున్న సోనా వరివంగడాలను అమెరికా మెచ్చుకుందని.. ఈ పంట తెలంగాణలోనే మాత్రమే పండుతుందని, ఈసారి 10లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ సోనా వరివంగడంలో షుగర్ శాతం చాలా తక్కువగా ఉంటుందని అన్నారు.
వరి దిగుబడిలో దేశంలోనే తెలంగాణకు తిరుగులేని రికార్డు సాధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పీడీఎస్ కింద తెలంగాణ ఇచ్చిందని, గతంలో 20, 30 లక్షలు మాత్రమే ఉండేదని పేర్కొన్నారు. ఇంతవరకు ఇండియాలో ఏ స్టేట్ కూడా నూటికి నూరు శాతం వరి కొనలేదని, కేవలం తెలంగాణలోనే కొన్నామని ఆయన అన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా కొన్ని ప్రత్యేకమైన నేలలు తెలంగాణలో ఉన్నాయని, అందుకే హైదరాబాద్లో ఏర్పాటు చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని, ఇక్కడ అద్భుతంగా పంటలు సాగు అవుతున్నాయని, అద్భుతమైన నైపుణ్యం ఉన్న రైతులు ఇక్కడ ఉన్నారని ఆయన అన్నారు. తెలంగాణలో రైతురాజ్యం కొనసాగుతోందని, రైతులను బాగు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలో కూడా లాక్డౌన్ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.