వైఎస్ జగన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. అయితే ఢిల్లీకి రాజా అయినా ఓ అమ్మకు కొడుకే అన్నట్టు.. ఏపీకి సీఎం అయినా సొంత నియోజక వర్గం అంటే ఎవరికైనా ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఈ విషయంలో సమకాలీన ముఖ్యమంత్రులు ఎవరకూ అతీతం కాదు.. తెలంగాణ సీఎం తన సొంత గ్రామం చింతమడకను ఎంతగా అభివృద్ధి చేశారో.. చంద్రబాబు కుప్పానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో తెలిసిందే.
ఇక ఇప్పుడు వైఎస్ జగన్ సొంత నియోజకవర్గానికి సంబంధించిన ఓ గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే.. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయిన పులివెందుల గ్రీన్ జోన్ గా మారింది. జిల్లా కలెక్టర్ ఈ విషయమై ఒక ప్రకటన చేశారు. పులివెందులలో కొన్ని రోజుల క్రితం నాలుగు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దాంతో పులివెందులను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. కంటైన్ మెంట్ జోన్ లో ఉండాల్సిన ఆంక్షలను కఠినంగా అమలు చేశారు.
పులివెందులలో చివరి కేసు ఏప్రిల్ 6వ తేదీ నమోదైంది. అయితే ఈ ప్రాంతంలో పాజిటివ్ వచ్చిన ఆఖరి కేసు కూడా తాజా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో ఏప్రిల్ 20 న డిశ్చార్జి చేసేశారు. అంటే.. పులివెందులలో కరోనా పాజిటివ్ వచ్చిన నలుగురు కోలుకున్నారు. ఇక అప్ప టి నుంచి 28 రోజులపాటు పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. దీంతో నిబంధనల ప్రకారం పులివెందులను గ్రీన్జోన్గా కలెక్టర్ ప్రకటించారు.
పులి వెందులలో కరోనా పూర్తిగా అదుపులోకి రావడం ఏపీ సీఎం జగన్ కు నిజంగా గుడ్ న్యూస్ గానే చెప్పాలి. ఎందుకంటే.. ఒక వేళ అక్కడ కేసులు పెరిగి ఉంటే.. చూడండి.. ఏపీ సీఎం సొంత నియోజకవర్గం లో కూడా కరోనాను అదుపు చేయలేకపోయారు.. అంటూ టీడీపీ నాయకులు ప్రచారం మొదలు పెట్టేవారు. ఇక ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు.