ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ప్రశ్నాపత్రాల్లో మార్పులు చేస్తోంది. రాష్ట్రంలో జులై నెలలో నిర్వహించబోయే పదో తరగతి పరీక్షల్లో బిట్ పేపర్ తొలగించాలని నిర్ణయించింది. గతంలోనే బిట్ పేపర్ ను తొలగిస్తారని వార్తలు వినిపించినా తాజాగా బిట్ పేపర్ తొలగిస్తున్నట్టు ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. 
 
2019 -2020 విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఇంటర్నల్ మార్కులను, బిట్ పేపర్ ను తొలగిస్తామని ప్రకటించగా... తాజాగా ఆ ఆ మార్పులు అమలయ్యాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం 11 పేపర్లను ఆరు పేపర్లకు కుదించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం కొత్త విధానంలో ప్రశ్నల సంఖ్యను పెంచకుండా మార్కుల సంఖ్యను పెంచినట్టు తెలుస్తోంది. 
 
గతంలో పరీక్ష వ్యవధి 2.45 గంటలు కాగా ప్రస్తుతం ప్రభుత్వం 3.15 గంటలకు పరీక్ష వ్యవధిని పెంచింది. ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోడల్ ప్రశ్నాపత్రాలను విడుదల చేసింది. జులై 10వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. 
 
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వం విద్యార్థుల ఇంటికి దగ్గరలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. లాక్ డౌన్ వల్ల చాలా మంది విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. విద్యార్థులు చదివిన పాఠశాలకు దగ్గరలోనే పరీక్షా కేంద్రం కేటాయిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని భావించి ప్రభుత్వం విద్యార్థుల ఇళ్లకు దగ్గరలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.                       

మరింత సమాచారం తెలుసుకోండి: