చైనాలోని వుహాన్ నగరం కేంద్రంగా జనించిన కరోనా వైరస్.. చూస్తుండగానే ప్రపంచాన్ని చుట్టేసింది. ప్రపంచానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. చైనాలో డిసెంబర్లో తొలి కరోనా కేసు నమోదై సుమారు ఆరు వెలుగు చూసి ఆరు నెలలైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కేసులు అరకోటి దాటేశాయి. 3 లక్షల 25వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు 213 దేశాలకు వైరస్ విస్తరించింది. ఈ వైరస్కు ప్రస్తుతం మందు లేకపోవడంతో దానితో కలిసి జీవించాల్సిన దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే ఆర్థికం, ఆరోగ్యం మధ్య సమన్వయం సాధించడం కోసమే దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. మొదట్లో చైనా, స్పెయిన్, ఇటలీ, ఆమెరికా తదితర దేశాలను కుదిపేసిన కరోనా ఇప్పుడు రష్యా, బ్రెజిల్, యూకేలో విజృంభిస్తోంది. కరోనా వైరస్ కారణంగా అమెరికా బెంబేలెత్తిపోతోంది. 15 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 93 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 50 రాష్ట్రాల్లోనూ లాక్డౌన్ను ఎత్తేశారు. న్యూయార్క్, న్యూజెర్సీలు శవాలదిబ్బలుగా మారితే ఇప్పుడు అమెరికాలో మారుమూల ప్రాంతాలకూ వైరస్ విస్తరిస్తోంది.
ప్రపంచ దేశాల్లో కోవి డ్–19 కేసుల్లో రష్యా రెండోస్థానానికి చేరుకుంది. కేసులు 3 లక్షలు దాటేశాయి. 3 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు, మూడు వారాలుగా ప్రతిరోజూ దాదాపుగా 10 వేల కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. గత రెండు వారాలుగా చైనాలోని వూహాన్ వెలుపల కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన పెంచుతోంది. చైనా ఉత్తర ప్రావిన్స్లలో 46 కేసుల వరకు నమోదయ్యాయి. అయితే వూహాన్లో వైరస్కి, ఇక్కడ వైరస్కి మధ్య తేడాలు చాలా ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు వైరస్ సోకిన 14 రోజుల్లో రోగిలో లక్షణాలు బయటకు వస్తున్నాయి. షులాన్, జిలిన్, షెంగ్యాంగ్ నగరాల్లో వైరస్ సోకి రెండు వారాలు దాటినా లక్షణనాలు బయట పడడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. కాగా, 83 వేల కేసులు, 4,634 మృతులని చైనా అధికారిక లెక్కలు చెబుతున్నాయి.