కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా అన్ని రంగాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా దేశాల మధ్య సంబంధాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. వాణిజ్యానికి సంబంధించి అనేక సంస్కరణలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిల్లు అయిన చైనా నుంచి అనేక విదేశీ కంపెనీలు తరలిపోయే ఎందుకు సిద్ధమవుతున్నాయి. ఇదే సమయంలో తమకు అనుకూలంగా ఉన్న దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో ప్రధానంగా చైనా నుంచి అమెరికా తన పెట్టుబడులను ఉపసంహరించుకుంటోంది.
ఇదే సమయంలో భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. కానీ.. అమెరికా ఒక కండిషన్ పెడుతోంది. తాము పెట్టుబడులు పెట్టాలంటే.. భారత్ తమకు అనుకూలంగా కొన్ని సంస్కరణలు చేపట్టాలని చెబుతోంది. అయితే ఇక్కడ అ ఒక కీలక అంశం ఉంది. అదేమిటంటే భారత్లో తయారైన వస్తువులను అమెరికాలో అమ్మడానికి ఆదేశం అనేక కండిషన్లు పెడుతుంది. అలాగే అమెరికా వస్తువులను కూడా భారత్లో అమ్ముకునేందుకు ఇక్కడి ప్రభుత్వం కూడా షరతులు విధిస్తుంది. అయితే భారత్ కొన్ని సంస్కరణలు చేపడితే, కొన్ని నిర్ణయాలు తమకు అనుకూలంగా తీసుకుంటే తాము పెట్టుబడులు పెడతామని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అమెరికా చెబుతోంది.
అయితే ఇందుకు భారత ప్రభుత్వం అంత సులభంగా ఒప్పుకోదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో అయితే అక్కడి ప్రభుత్వం ఎలాంటి షరతులు విధిస్తుందో.. ఇక్కడ కూడా భారత ప్రభుత్వం అలాంటి షరతులే విధిస్తుందని చెబుతున్నారు. అమెరికా.. మా ఇంటికొస్తే ఏం తెస్తావు.. మీ ఇంటికొస్తే ఏం ఇస్తావు.. అన్న చందంగానే ఈ అగ్రరాజ్యం వ్యవహరిస్తుందని అంటున్నారు. ముందుగా అమెరికన్లు.. ఆ తర్వాత మిగతావాళ్లు అని అక్కడి ప్రభుత్వం అంటోంది. ఇదే విషయాన్ని ట్రంప్ అనేకమార్లు చెప్పారు. అయితే.. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి మరి.