ఏపీ సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి యేడాది కాలం పూర్తయ్యింది. ఇక జగన్ కొద్ది రోజుల క్రితమే రాజధానిని విశాఖకు తరలిస్తున్నట్టు ప్రకటన చేసిన వెంటనే ఏపీ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనూ ఎక్కడా లేని సంచలనం అయితే నమోదు అయ్యింది. అయితే అంతా విశాఖకు తరలి పోతోంది అనుకుంటున్న టైంలో నే విశాఖకు షాక్ తగిలింది. కరోనా ఎఫెక్ట్ తో విశాఖ రాజధాని రాజసానికి టైం పట్టింది. దీనికి తోడు అనేక ప్రతికూల అవరోధాలు కూడా తోడయ్యాయి. ఇక ఇప్పుడు కరోనా హడావిడి కూడా తగ్గుముఖం పట్టనున్న నేపథ్యంలో విశాఖకు రాజధానిని తరలించేందుకు ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయని అంటున్నారు.
మరో ఐదు నెలల్లో విశాఖకు రాజధానిని తరలించే ప్రక్రియ పూర్తవుతుందని సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ 25న విజయదశమి శుభవేళ విశాఖకు పాలనారాజధాని తరలిరానుంది. ఇది బ్రహ్మాండమైన ముహూర్తంగా విశాఖ శారదాపీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర పేర్కొంటున్నారు. ఇంతకు మించిన బ్రహ్మాండ మైన ముహూర్తం అయితే ఇప్పట్లో లేదట. దీనిని బట్టి చూస్తే విశాఖ కు రాజధానిని తరలించే ప్రక్రియ అక్టోబర్ 25వ తేదీ నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇక స్వరూపా నందేంద్ర స్వామి చెప్పిన దాని ప్రకారం ఈ ముహూర్తానికి కనుక రాజధాని ని మారిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని చెపుతున్నారట. ఇక వైజాగ్ లో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, నివాసం అన్ని బీచ్ రోడ్ లోని గ్రే హౌండ్స్ లో ఉండేలా ఎంపిక చేశారట. ఇక మంత్రుల కార్యాలయాలు .. ఇతరత్రా సచివాలయాలతో పాటు కొన్ని ప్రభుత్వ ఆఫీసుల కోసం అక్కడ ఉన్న ఐటీ కంపెనీల ఆఫీసులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక జగన్ మనసులో సైతం ఇదే ముహూర్తం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా దసరాకు విశాఖ రాజధానిగా పాలన ప్రారంభమవుతోంది. ఏపీ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది.