అధికారం ఉంది కదా అని అమాయకులపై దాష్టికాన్ని ప్రదర్శిస్తే.. వారు పడే ఆవేదన కనీసం కంటికి కనిపించకపోతే.. అసలే కరోనా కష్టాల్లో ఉన్నాం.. సంపాదన లేదు అంటే చిరు వ్యాపారులు ఎన్ని బాధలు పడుతున్నా కనీసం కనికరం లేకండా తినే కూరగాయలు, పండ్లను నేల మట్టం చేసిన ఓ పోలీస్ అధికారి కృరత్వం చూస్తే ఎవ్వరికైనా చిరాకు పుడుతుంది. తాజాగా ఒంటిపై ఖాకీ చొక్కా ఉందనే అహంకారంతో ఓ పోలీసు అధికారి తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. తన జీపుతో వచ్చి కూరగాయల మార్కెట్లో హంగామా సృష్టించాడు. వాటి పైనుంచి తన వాహనాన్ని పోనిచ్చి అన్నింటిని నాశనం చేశాడు. అతడి చర్యకు మార్కెట్లో ఉన్న వారంతా భయాందోళనకు గురయ్యారు.
ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గూర్పూర్ పోలీస్ స్టేషన్లో పని చేసే సబ్ ఇన్స్పెక్టర్ సుమిత్ ఆనంద్ వారంతపు సంతకు వచ్చాడు. అక్కడ అమ్మవద్దనే ఆదేశాలు ఇచ్చినా ఎందుకు సంత నిర్వహించారనే కోపంతో దారుణానికి ఒడిగట్టాడు. అమ్మకం దారులు పోసిన కూరగాయల తన జీపుతో తొక్కించాడు. అతి వేగంగా వాటిపై నుంచి వెళ్తూ ఉంటే కూరగాయలు, పండ్లు అన్నీ చెల్లా చెదురుగా పడి పనికి రాకుండా పోయాయి. అయినా ఈ అధికారి కసి తీరక రివర్స్ వచ్చి మరీ తొక్కించాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేశారు. అక్కడ బుధ, శుక్రవారాల్లో సంతకు అనుమతి ఉండగా.. గురువారం నిర్వహించారనే కోపంతో అలా చేశాడు.