చైనాలోని వుహాన్ నగరం కేంద్రంగా జనించిన కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. గత ఏడాది డిసెంబర్ చివరలో బయటపడిన ఈ వైరస్ చూస్తుండగానే ప్రపంచాన్ని చుట్టేసింది. ఇప్పటివరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అరకోటిని దాటిపోగా.. మరణాల సంఖ్య ఏకంగా 4లక్షల మార్క్ను చేరుకుంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే.. మొదటి లక్ష మరణాలకు నాలుగు నెలల సమయం పడితే.. మరో 15 రోజుల్లోనే మరణాల సంఖ్య 200,000 కు రెట్టింపు అయింది. తరువాతి 100,000 మరణాలు వరుసగా 20, 23 రోజుల్లోనే సంభవించాయి. చైనా తర్వాత స్పెయిన్, ఇటలీ, యూకే, ఫ్రాన్స్ను దారుణంగా దెబ్బతీసిన కరోనా ఆ తర్వాత అమెరికాను దెబ్బతీసింది. తాజాగా.. లాటిన్ అమెరికా, ముఖ్యంగా బ్రెజిల్ కరోనా వైరస్కు హాట్స్పాట్గా మారిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అమెరికాలో 1.97 మిలియన్ కేసులు నమోదు కాగా, 111,658 మరణాలు సంభవించాయి.
అయితే.. ప్రస్తుతం అమెరికాలో వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పడినట్టు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు మెక్సికో, రష్యా, భారతదేశంలో రోజువారీగా వేలకొద్దీ కొత్త కేసులు నమోదు అవుతుండగా వందలాది మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా శనివారం వరకు 6,916,826 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 400,012 మరణాలు సంభవించాయి. ఇందులో 246,472 కేసులతో భారత దేశం శనివారం ఇటలీని అధిగమించింది. అయితే.. ఇప్పటివరకు భారత్లో 6,873 మంది మరణించారు. శనివారం వరకు 2.8% మరణాల రేటు ఉంది. ఇక యూఎస్ (5.6%), యూకె (14.2%) వంటి ఇతర కష్టతరమైన దేశాల మరణాల రేటు కంటే గణనీయంగా తక్కువగా ఉంది. భారత్లో మరణాల రేట్ చాలా తక్కువగా ఉండడం మంచి పరిణామమని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.