రిలయన్స్.. ఇండియాలో కార్పొరేట్ దిగ్గజం. ఇప్పుడు కరోనా వైరస్ కాలంలో షేర్ మార్కెట్ దిగాలుపడింది. కానీ రిలయన్స్ కంపెనీ మాత్రం మొదట్లో కాస్త డల్ అయినా ఇటీవల బాగా పుంజుకుంది. అంతర్జాతీయ సంస్థలతో డీల్స్ కుదుర్చుకుంది. ప్రపంచంలోని పేరెన్నికగన్న కంపెనీలు రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే ఇదంతా అంబానీ గొప్పదనమే అనుకున్నా.. ఈ డీల్స్ వెనుక అసలు వ్యక్తి గురించి ప్రపంచానికి తెలిసింది తక్కువే.
ఆ వ్యక్తి మనోజ్ మోదీ..! ఈ మనోజ్ మోదీ పేరు బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఆయన అసలు బయటకనిపించడు. ఈయన రిలయన్స్ ఇండస్ట్రీస్లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ఒకరు. ఇంతకీ ఆయన బాధ్యతలు ఏంటి.. అంటే.. ఆయన రిలయన్స్ రిటైల్తోపాటు రియలన్స్ జియో ఇన్ఫోకామ్ డైరెక్టర్. ధీరుభాయ్ అంబానీ పెట్రోలియం సామ్రాజ్య నిర్మాణం ప్రారంభించిన 1980ల నుంచి కంపెనీతో ఉన్న వ్యక్తుల్లో మనోజ్ హరిజీవన్దాస్ మోదీ ఒకరు.
ఈ మోదీ తన గురించి తాను ఏం చెబుతారో తెలుసా.. నేను బేరాలు చేయలేను. నాకు వ్యూహాలు అర్థం కావు. కంపెనీలో అంతర్గతంగా ఉండేవారికి ఈ విషయాలు తెలుసు. నాకు పెద్దగా ముందు చూపు కూడా లేదు. నేను కేవలం సంస్థలో వారితో కలిసే పనిచేస్తా. వారికి శిక్షణ ఇవ్వడం.. కీలకమైన బాధ్యతలను ఎలా నిర్వహించాలో నేర్పిస్తా. మనతో కలిసిన వ్యాపార భాగస్వాములు లాభపడనంతకాలం.. మనం నిలదొక్కుకోలేం అనే రిలయన్స్ వ్యాపార సూత్రం నుంచి నేర్చుకొంటా’ అని చెబుతారు.
అయితే ఆయన చెప్పేదంతా నిజం కాదు.. ఎందుకంటే.. రిలయన్స్ ఆయన సలహాలతోనే అనేక స్టార్టప్లను కొనేసింది. రిలయన్స్ భవిష్యత్ కోసం పనికొచ్చే డిజిటల్ వ్యాపారాల కోసం ఆయన ఈ స్టార్టప్లను కొనిపించారు. ఒకసారి ఈ మనోజ్ మోదీతో మీటింగ్ జరిగితే దానికి రిలయన్స్ ఓకే చెప్పేసినట్టే అంటారు. 2010లో ఎయిర్ డెక్కన్ వాటాలను రిలయన్స్కు అమ్మేసింది. ఆ డీల్లోనూ మనోజ్ మోదీయే కీలక పాత్రధారి.